అనిల్ బ్రో .. పొలిటికల్ కెరీర్ క్లోజేనా?
posted on Apr 3, 2025 12:24PM
.webp)
ఏపీలో ఎన్నికలకు ముందు మీసాలు మెలేసి, తొడలు కొట్టిన మాజీ మంత్రి అనిల్కుమార్యాదవ్ ఫలితాల తర్వాత పత్తా లేకుండా పోయారు. చంద్రబాబుతో పాటు పవన్పై విరుచుకుపడిన ఆ ఫైర్బ్రాండ్ నేత సడన్గా సైలెంట్ అయ్యారు. ఫలితాలు వచ్చిన రోజు నుంచి ఆయన అజ్ఞాతంలోకి వెళ్లి పోవడం నెల్లూరులో హాట్ టాపిక్గా మారింది. పదేళ్లు ఎమ్మెల్యేగా, దాదాపు మూడేళ్లు మంత్రిగా పనిచేసిన ఆ సారు ఇప్పుడు ఇంతకాలం తనకు అండగా ఉన్న అనుచరులకు కూడా అందుబాటులో లేరంట. దాంతో ఆయన పొలిటికల్ ఫ్యూచర్పై రకరకాల ఊహాగానాలు చెలరేగుతున్నాయి
వైసీపీ ప్రభుత్వంలో దాదాపు మూడేళ్లు మంత్రిగా పనిచేసిన సింహపురి నేత అనిల్కుమార్ యాదవ్. ఆ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, తర్వాత అధికారంలో కొనసాగినప్పుడు అనిల్ దూకుడు అలా ఇలా కాదు ఓ రేంజ్ లో ఉండేది. అసెంబ్లీలో సైతం చొక్కా గుండీలు విప్పుకుని బజారు గూండాలా టీడీపీ నేతలపై అవాకులు చవాకులు పేలుతూ, సవాళ్లు విసురుతూ నానా హడావుడి చేసేవారు. వైసీపీ బూతు మంత్రుల్లో ఒకరిగా ఫోకస్ అయ్యారు.
అనిల్ అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చిన నేత. తన చిన్నాన్న మరణంతో ఆయన రాజకీయ వారసుడిగా పాలిటిక్స్లోకి వచ్చారు. అప్పట్లో ఆనం ఫ్యామిలీ ఆశీస్సులతో నెల్లూరు కార్పొరేటర్గా గెలిచారు. నెల్లూరు సిటీ రాజకీయాల్లో మొదట్నుంచీ రెడ్డి సామాజిక వర్గం పెత్తనమే నడిచేది. 1972 నుంచీ అక్కడ వారిదే ఆధిపత్యం... అయితే 2014, 2019 ఎన్నికల్లో సీన్ మారింది. వైసీపీ నుంచి బీసీ వర్గానికి చెందిన అనిల్ యాదవ్ రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వైసీపీ హయాంలో మొదటి టర్మ్ మంత్రిగా పనిచేశారు.
మొదట్నుంచీ అగ్రెసివ్గా వ్యవహరించిన అనిల్ కుమార్ యాదవ్, జగన్పై ఈగ వాలనిచ్చేవారు కాదు. ఎవరైనా జగన్ను విమర్శిస్తే, ముందూ వెనుకా చూడకుండా విరుచుకుపడేవారు. జగనన్నకు నమ్మిన బంటునని ఓపెన్గానే చెప్పుకునే వారు. ఆ దూకుడుతోనే జగన్ దగ్గర మంచి మార్కులు కొట్టేసి, జిల్లాలో సీనియర్ నేతలు కీలకంగా ఉన్నప్పటికీ, జగన్ క్యాబినెట్లో స్థానం దక్కించుకోగలిగారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ధోరణి పూర్తిగా మారిందని ఆయన సన్నిహితులు చెబుతుంటారు.
ఎవరినీ ఖాతరు చేయరనే విమర్శలు ఎక్కువయ్యాయి. పార్టీలోని నేతలపైనే పరోక్ష విమర్శలు చేసేవారు. తాను ఏం చెబితే జగన్ అదే చేస్తారని అనిల్ చెప్పుకునేవారంట. ఆయన మాట తీరుపై సొంత పార్టీ నేతలే అసహనం వ్యక్తం చేసిన సందర్భాలు లేకపోలేదు. మంత్రిగా ఉన్నా, జిల్లా అభివృద్ధికి ఆయన ఏమీ చేయలేదనే విమర్శలున్నాయి. 2024 ఎన్నికలకు ముందు పార్టీలోని పలువురు నేతలు రకరకాల కారణాలతో అనిల్కు దూరమయ్యారు.
అయినా బీసీ సామాజిక వర్గం, యూత్లో మంచి ఫాలోయింగ్ ఉండటంతో జగన్ కూడా అనిల్ని బానే ప్రోత్సహించారు. మంత్రిగా ఉన్నప్పుడు నెల్లూరు జిల్లాలో పరిధులు దాటి ఓవర్ యాక్షన్ చేసిన ఆయన, ఒక రకంగా చెప్పాలంటే తన గొయ్యి తానే తవ్వుకున్నారంటారు. నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా రెండు సార్లు పనిచేసిన అనిల్, సొంత పార్టీలోనే అందరికీ శత్రువయ్యారు. తన తర్వాత జిల్లా నుంచి మంత్రి పదవి దక్కించుకున్న కాకాణి గోవర్ధన్రెడ్డితో విభేధాలు, ప్రస్తుత టీడీపీ నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి వైసీపీలో ఉన్నప్పుడు ఆయనతో గ్యాప్ వంటివి మూడో సారి అనిల్కు నెల్లూరు సిటీ టికెట్ దక్కకుండా చేశాయి.
వైసీపీ తరపున నెల్లూరు సిటీ నియోజకవర్గంలో అనిల్ను కాదని మరో గట్టి అభ్యర్థిని పోటీకి దించాలని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రయత్నించినా, అనిల్ కుమార్ తనకు అనుకూలంగా ఉన్న డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్కు దగ్గరుండి టికెట్ ఇప్పించుకున్నారు. దాంతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీని వీడి తెలుగుదేశంలో చేరారు. ఇక నెల్లూరు సిటీ నుంచి పోటీ చేసిన ఖలీల్ అహ్మద్ టీడీపీ నుంచి పోటీ చేసిన నారాయణ చేతిలో దారుణంగా ఓడిపోయారు . అసలు టికెట్ల కేటాయింపు సమయంలోనే అనిల్ టికెట్ రాదనే ప్రచారం జోరుగా సాగింది. అంత సీన్ లేదు, తనకు ఎవరూ అడ్డుకోలేరని.. అనిల్ ఘాటుగా రియాక్టయ్యారు. ప్రత్యర్థి నారాయణ గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని కూడా సవాల్ విసిరారు . అయితే ఎన్నికల సమయంలో ఆ ప్రచారమే నిజమైంది . జగన్ ఆదేశాలతో ఆయన నరసరావుపేట నుంచి ఎంపీగా పోటీ చేసి ఘోర పరాజయం పాలయ్యారు.
గెలవకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని నెల్లూరులో సవాల్ చేసిన అనిల్, రిజల్ట్ తర్వాత ఏమైంది మీ రాజకీయ సన్యాసం అని అడిగితే తన సవాల్ని ప్రత్యర్థులు తీసుకోలేదని కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు . అనిల్ మాట నిలబెట్టుకోకపోయినా, పరిస్థితులు నిజంగానే ఆయన్ని రాజకీయ సన్యాసం తీసుకునేలా చేశాయంటున్నారు. ఓటమి తర్వాత అనిల్ కుమార్ సింహపురిలో కనిపించడమే మానేశారు. పార్టీ యాక్టివిటీస్కి కూడా పూర్తిగా దూరమయ్యారు.
ఏమైపోయారా అని ఆరా తీస్తే ఆయన నెల్లూరు నుంచి చెన్నైకి ఫ్యామిలీని షిఫ్ట్ చేశారని తెలిసింది . అక్కడ ఆయనకి కొన్ని బిజినెస్లు ఉన్నాయంట. హైదరాబాద్లో కూడా వ్యాపారాలు ఉన్నాయని, వాటినే ఫుల్ టైం చూసుకుంటున్నారని చెబుతున్నారు. అప్పుడప్పుడూ నెల్లూరుకు వస్తున్నా.. తన సన్నిహితులతో మాట్లాడి చాటుగా వెళ్లిపోతున్నారు తప్ప, పెద్దగా బయటకు ప్రొజెక్ట్ కావడం లేదంటున్నారు. ఈ వ్యవహారం అంతా చూస్తూ .. మా అనిల్ బ్రో.. పొలిటికల్ కెరీర్ క్లోజ్ అయిందని ... రాజకీయ సన్యాసం తీసేసుకున్నారని సింహపురిలోని ఆయన పాత అనుచరులు ప్రచారం మొదలు పెట్టడం విశేషం.
ఇదికూడా చదవండి https://www.teluguone.com/news/amp/content/anil-kumar-yadev-obscand-39-178365.html