నేడు వరంగల్ ఓట్ల లెక్కింపు

 

వరంగల్ పార్లమెంట్ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక ఫలితం మంగళవారం నాడు వెల్లడి కానుంది. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. వరంగల్‌లోని ఎనుమాముల మార్కెట్ యార్డ్‌లో లెక్కింపు జరుగుతుంది. వరంగల్ పార్లమెంట్ స్థానం పరిధిలో ఏడు శాసనసభ నియోజకవర్గాలు వున్నాయి. ప్రతి నియోజకవర్గానికీ 14 టేబుళ్ళు వుంటాయి. మొత్తం లెక్కింపు 22 రౌండ్లలో పూర్తవుతుంది. మధ్యాహ్నం 2 గంటల లోపు తుది ఫలితం రానుంది. తొలిరౌండ్ ఫలితాన్ని మంగళవారం ఉదయం 8.20 నిమిషాలకు ప్రకటిస్తారు. మొదట బ్యాలెట్ ఓట్లను లెక్కించి, ఆ తర్వాత ఈవీఎంల ఓట్లు లెక్కిస్తారు. ఓట్ల లెక్కింపులో ఆరు వందల మంది సిబ్బంది పాల్గొననున్నారు. వరంగల్ ఉప ఎన్నికలో 69.19 శాతం ఓట్లు పోలయ్యాయి. 23 మంది అభ్యర్థులు పోటీలో వున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu