ఆ ముగ్గురిపై రేపు కోర్టులో తెదేపా పిటిషన్

 

రాజకీయ నాయకులు అధికారం కోసం పార్టీలు మారడం కొత్తేమీ కాదు. కాకపోతే పార్టీలు మారిన తరువాత పాత పార్టీ శాసనసభ్యులుగానే కొనసాగడం లేటెస్ట్ ట్రెండ్ అని చెప్పుకోవలసి వస్తోంది. అనేక ఏళ్లపాటు తెదేపాలో కొనసాగిన తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణా రెడ్డి, ధర్మారెడ్డి వంటి ప్రజాప్రతినిధులు అందరూ ఆ కోవకు చెందినవారే. వారు తెదేపా నుండి తెరాసలోకి వెళ్ళినా నేటికీ తెదేపా శాసనసభ్యులుగానే కొనసాగుతున్నారు. ఈ విషయం సాక్షాత్ శాసన సభ కార్యదర్శి ఈరోజు విడుదల చేసిన శాసనసభ సభ్యుల జాబితాలోనే పేర్కొనబడింది. పార్టీని వీడినప్పుడు ఇంకా ఆ పార్టీ శాసనసభ్యులుగానే ఎందుకు కొనసాగుతున్నారనే ప్రశ్నకు వారే జవాబు చెప్పాలి. కానీ వారు చెప్పడానికి ఇష్టపడటం లేదు. అలాగని పదవులను వాదులుకోవడానికి వారు ఇష్టపడటం లేదు. అందుకే ఆ ముగ్గురిని యం.యల్సీ. ఎన్నికలలో ఓటు వేయకుండా దూరంగా ఉండమని ఆదేశించాలని కోరుతూ తెదేపా హైకోర్టులో సోమవారంనాడు ఒక పిటిషను వేసింది. శాసనసభ కార్యదర్శి ఈరోజు విడుదల చేసిన శాసనసభ సభ్యుల జాబితాను కూడా రేపు కోర్టుకి సమర్పించి, వారిపై అనర్హత వేటు వేయాలని తెదేపా కోరబోతున్నట్లు సమాచారం. శాసనసభ్యుడిగా దక్కే అధికారం కోసం, జీతభత్యాలకు ఆశపడుతున్న వారిపై ఒకవేళ కోర్టు అనర్హత వేటువేస్తే వారి పరిస్థితి ఏమిటో?

Online Jyotish
Tone Academy
KidsOne Telugu