తల్లి గోల్డ్ మెడలిస్ట్.. తండ్రి వైస్ ప్రిన్సిపాల్.. దివ్యశక్తుల కోసం కన్నబిడ్డలను కడతేర్చారు 

ఎంత విద్యావంతులైనా మూఢ భక్తి తలకెక్కితే జరిగే అనర్ధాలు ఏ స్థాయిలో ఉంటాయో తెలిపే ఘటన ఏపీలోని చిత్తూరు జిల్లా మదనపల్లిలో చోటు చేసుకుంది. అది ఒక ఉన్నత విద్యావంతుల కుటుంబం. తల్లిదండ్రులు ఇద్దరు అధ్యాపక వృత్తిలో ఉండగా పిల్లలు ఉన్నత చదువులు చదువుకుని తమ తమ రంగాల్లో రాణిస్తున్నారు. పెద్దమ్మాయి నిన్నటిదాకా ఫారెస్ట్‌ సర్వీసులో జాబ్ చేసింది. ఇక చిన్నమ్మాయి సంగీతంపై ఇష్టంతో సాధన చేస్తోంది. అటువంటి కుటుంబంలో ఆదివారం రాత్రి ఒక్కసారిగా క్షుద్ర పూజల నేపథ్యంలో దారుణం చోటు చేసుకుంది. మూఢనమ్మకాలు, ఆపై పరాకాష్టకు చేరిన మూఢభక్తి.. రెండూ తోడై.. దివ్యశక్తులను వశపరుచుకోవడం కోసమంటూ ఇద్దరు పెళ్లీడుకొచ్చిన ఆడపిల్లలను కన్నతల్లే అతి దారుణంగా కడతేర్చింది.

 

ఈ ఘటన పూర్తీ వివరాల్లోకి వెళితే.. శివనగర్‌కు చెందిన పురుషోత్తం నాయుడు మదనపల్లె ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో వైస్ ప్రిన్సిపల్. ఆయన భార్య పద్మజ ఓ విద్యాసంస్థలో కరస్పాండెంట్‌గా, ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్నారు. వారికి అలేఖ్య (27), సాయిదివ్య (22) ఇద్దరు కుమార్తెలు. అయితే కరోనా నేపథ్యంలో పిల్లలు ఇద్దరు ఇంటివద్దే ఉంటున్నారు. అలేఖ్య సివిల్స్‌కు సిద్ధమవుతోంది. రెండో అమ్మాయి సాయిదివ్య ఎంబీఏ పూర్తిచేసి చెన్నైలోని ఏఆర్‌ ఇనిస్టిట్యూట్‌లో మ్యూజిక్‌ ప్రాక్టీస్ చేస్తున్నారు. గతేడాది వీరు స్థానికంగా కట్టుకున్న సొంత ఇంటిలోకి మారినప్పటినుండి ఇంట్లో క్షుద్రపూజలు నిర్వహించేవారని స్థానికులు చెబుతున్నారు.

 

ఈ క్రమంలో మూడురోజులుగా బయటి వ్యక్తులను పిలిపించి ఎడతెరపి లేకుండా పూజలు చేస్తున్నారు. ఇందులోభాగంగా ఆదివారం పూజగదిలోనే పెద్దకుమార్తె అలేఖ్యను పద్మజ.. డంబెల్‌తో నుదిటిపై మోది చంపేశారు. అంతేకాకుండా చనిపోయిన అలేఖ్యను పూజా క్రతువులో భాగంగా బతికించుకొనేందుకు రెండోకుమార్తె సాయిదివ్యను పైఅంతస్తులోని బెడ్‌రూమ్‌లో ఇదే తరహాలో భర్త ఎదుటే తల్లి పద్మజ చంపేసింది.

 

ఈ ఘటన అనంతరం ఆ పిల్లల తండ్రి ఈ విషయాన్ని కాలేజీలోని తోటి ఉపాధ్యాయుడికి చెప్పడంతో ఆయన వెంటనే వారి ఇంటికి చేరుకుని.. అక్కడి పరిస్థితి గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. నిందితులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. మదనపల్లె డీఎస్పీ రవిమనోహరాచారి మాట్లాడుతూ.. తమ బిడ్డలు మళ్లీ బతుకుతారన్న మూఢభక్తితోనే వారు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. కుమార్తెలు ఇద్దరినీ తల్లే చంపిందని.. ఆ సమయంలో తండ్రి అక్కడే ఉన్నారని పేర్కొన్నారు. పురుషోత్తం నాయుడు, పద్మజ ఇద్దరూ మానసిక సమస్యలతో బాధపడుతున్నట్టు గుర్తించామని.. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని అయన తెలిపారు.