బీజేపీ చీఫ్ పదవికి రాజీనామా చేయనున్న అమిత్ షా
posted on May 29, 2019 4:35PM

'మోదీ-షా'ల ద్వయం.. ఒకరు ప్రభుత్వాన్ని మరొకరు పార్టీని నడిపించే బాధ్యత తీసుకున్నారు. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చాక వీరిద్దరూ దేశంలోనే అత్యంత శక్తివంతులైన నేతలుగా ఎదిగారు. ఇప్పుడు 2019లో కూడా అమిత్ షా సారథ్యంలో బీజేపీ మరోసారి ఎన్నికలకు వెళ్లి గెలిచింది. అమిత్ షా ఈసారి గాంధీనగర్ నుంచి ఎంపీగా గెలిచారు. అయితే అమిత్ షా త్వరలో బీజేపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయబోతున్నట్లు తెలుస్తోంది. దానికి కారణం.. ఆయనకు కేంద్రంలో కీలక మంత్రి పదవి దక్కనుందని ప్రచారం జరుగుతుంది.
2014, 2019 ఎన్నికల్లో బీజేపీ విజయంలో కీలక పాత్ర పోషించిన అమిత్ షాను మంత్రివర్గంలోకి తీసుకోవాలని మోదీ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి.. ఆయన స్థానంలో కొత్త వారికి బాధ్యతలు అప్పగిస్తారనే వార్తలు వస్తున్నాయి. అయితే అమిత్ షా వలే బలమైన కీలక నేత ఎవరనేదానిపై పార్టీలో చర్చ జరుగుతోంది. ప్రధానంగా ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. జేపీ నడ్డా పేరు ముందంజలో ఉంది. ఆ తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ పేరు కూడా బలంగా వినిపిస్తోంది.
నడ్డా మొన్నటి ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ బాధ్యతలు చేపట్టి అక్కడ బీజేపీకి 62 ఎంపీ సీట్లను గెలిపించడంలో కృషి చేశారు. ఇక ధర్మేంద్ర ప్రధాన్ ఒడిషాలో అస్సలు లేని బీజేపీని ఈసారి ప్రతిపక్షంగా నిలబెట్టారు. 39శాతం ఓట్లను ఒడిషాలో రాబట్టారు. వీరిద్దరిలో ఒకరిని జాతీయ అధ్యక్ష పదవికి ఎంపిక చేయాలని బీజేపీ అధిష్టానం యోచిస్తోంది. మరి అమిత్ షాకు కేంద్ర మంత్రివర్గంలో ఏ శాఖ అప్పగిస్తారో చూడాలి.