సెప్టెంబర్ 17ని తెలంగాణ స్వతంత్ర దినోత్సవంగా జరుపుతాం.. రేవంత్రెడ్డి పిలుపు..
posted on Sep 17, 2021 11:03AM
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సెప్టెంబర్ 17ను తెలంగాణ స్వతంత్ర దినోత్సవంగా అధికారికంగా జరుపుతామని పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి తెలిపారు. తెలంగాణలో నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన దొడ్డి కొమురయ్య, షాయబుల్లాఖాన్, రాంజీ, చాకలి అయిలమ్మ, కొమురం భీంల పోరాట స్ఫూర్తితో పని చేస్తామని చెప్పారు. హిందువులు, ముస్లింలు కలిసి నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేశారని గుర్తు చేశారు.
తెలంగాణ విలీన దినోత్సవం సందర్బంగా గాంధీభవన్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రొటీన్కు భిన్నంగా.. బీజేపీని ఏకిపారేశారు రేవంత్రెడ్డి.
తెలంగాణలో సాయుధ రైతాంగ పోరాటం దేశ చరిత్రలో ప్రధాన ఘట్టమన్నారు. బ్రిటిష్ నుంచి భారత్ కు స్వాతంత్య్రం వచ్చినపుడు నిజాం పాలకులు తెలంగాణను ఇండియాలో విలీనం చేయకుండా స్వతంత్రంగా ఉండాలని లేదా, పాకిస్తాన్లో విలీనం చేయాలని చూసారు. అప్పుడు ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఆదేశాలతో సర్దార్ వల్లభాయ్ పటేల్.. ఆపరేషన్ పోలో జరిపి తెలంగాణను భారత్లో విలీనం చేశారని చరిత్ర చెప్పుకొచ్చారు.
తెలంగాణకు స్వాతంత్రం వచ్చిన రోజు ఈ రోజు. తెలంగాణకు స్వాతంత్రం ఇచ్చిన ఘనత కాంగ్రెస్ది. ఇప్పుడు కొంతమంది కొత్త బిచ్చగాళ్ల వచ్చారు.. వెయ్యి ఉరిల ఊడల మర్రికి వస్తున్నారు.. అది ఎప్పుడు జరిగిందో కూడా వాళ్లకు తెలియదు అంటూ పరోక్షంగా ఇవాళ జరగనున్న బీజేపీ సభను, అమిత్షాను ఉద్దేశించి కామెంట్లు చేశారు.
జవహర్లాల్ నెహ్రు నిర్ణయం వల్లనే తెలంగాణ విలీనం జరిగింది. ప్రధాన మంత్రి నిర్ణయాన్ని హోంశాఖ మంత్రి అమలు చేస్తారు. బీజేపీ వాళ్ళు తెలంగాణ విలీనం గొప్పతనం హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ది అని మాత్రమే చెప్తున్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా కాంగ్రెస్ అధ్యక్షులుగా కేంద్ర హోమ్ శాఖ మంత్రిగా పని చేసారు. బీజేపీ వాళ్లకు చెప్పుకోవడానికి ఒక్క నాయకులు కూడా లేరు.. అందుకే కాంగ్రెస్ నేతల పేర్లు వాడుకుంటున్నారంటూ బీజేపీని ఘాటుగా విమర్శించారు పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి.