ప్రకాశ్ రాజ్ వదలడం లేదుగా?!

తిరుమల లడ్డూ వ్యవహారంలో నటుడు ప్రకాశ్ రాజ్ పవన్ కల్యాణ్ టార్గెట్ గా ట్వీట్లు కురిపిస్తూనే ఉన్నారు. ఈ వివాదం జాతీయ సమస్యగా పరిణమించడమే కాకుండా సుప్రీం వద్దకు కూడా వెళ్లింది. లడ్డూ వివాదం విషయంలో ఆంధ్రప్రదేశ్ లో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం సాగుతోంది.  ఈ విషయంలో దోషులెవరు, వారిని ఎలా శిక్షిస్తారు అన్న చర్చ జోరుగా సాగుతోంది.  ఇంకో పక్క   ప్రకాష్‌రాజ్‌  ఈ విషయంలో పవన్ కల్యాణ్ టార్గెట్ గా వరుస ట్వీట్లు పెడుతున్నారు. జస్ట్ ఆస్కింగ్ అంటూ సామాజిక మాధ్యంలో ఆయన పవన్ కల్యాణ్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. నేరుగా పవన్ కల్యాణ్ పేరు ప్రస్తావించకుండా పరోక్షంగా ఆయనకే  ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్నారు.  

ప్రకాష్‌రాజ్‌ మొదట పెట్టిన ట్వీట్‌పై పవన్‌కళ్యాణ్‌ తీవ్రంగా స్పందించడంతో తన రెండో ట్వీట్‌లో నేను చెప్పింది ఏమిటి, మీరు అర్థం చేసుకున్నదేమిటి.. అంటూనే తాను విదేశాల్లో ఉన్నాననీ, వచ్చిన తర్వాత అన్నింటికీ సమాధానం చెప్తానని అన్నారు. ఇది జరిగిన రెండు రోజులకే కార్తీ వ్యాఖ్యల విషయంలో పవన్‌కళ్యాణ్‌ సీరియస్‌ కావడం, దాంతో కార్తీ.. పవన్‌కి సారీ చెప్పడంపై స్పందిస్తూ ప్రకాశ్ రాజ్ చేయని తప్పుకు క్షమాపణలు చెప్పించారు.. హ్యాపీనా అంటూ ట్వీటారు. 

తాజాగా మరో వివాదాస్పదమైన ట్వీట్‌తో మరో సారి పవన్ ను నిలదీశారు ప్రకాష్‌రాజ్‌.  కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువ కదా?  ఇక చాలు. ప్రజల కోసం చేయవలసిన పనులు చూడండి అంటూ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.  ఇటీవల పవన్‌కళ్యాణ్‌ 11 రోజులపాటు ప్రాయశ్చిత్త దీక్ష చేసిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని టార్గెట్‌ చేస్తూ దీక్షలు మానేసి ప్రజలకు చెయ్యాల్సిన పనులు చూడండి అని అర్థం వచ్చే పెట్టిన ట్వీట్‌ వైరల్ అయ్యింది. నెటిజనులు ప్రకాశ్ రాజ్ పై ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నారు. అనవసర వివాదాలను రేపడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు.