కేసీఆర్ ముందస్తుకి వెళ్ళినందుకే గెలిచారట !
posted on Jul 8, 2019 4:18PM

ఆదివారం నాడు తిరుపతిలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలుగు రాష్ట్రాల పాలిటిక్స్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే తెలంగాణా మీద ఫోకస్ చేసిన అమిత్ షా నెలకి ఇద్దరు మంత్రుల్ని పంపుతానని క్లారిటీ ఇవ్వడంతో వారు ఇప్పటి నుండే తెలంగాణా ప్రభుత్వం మీద విరుచుకు పడుతున్నారు. మోడీని ఓడించి దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతామన్న నేతలను పార్టీలను ప్రజలు ఓడించి గుణపాఠం చెప్పారంటూ పరోక్షంగా బాబుపై ఆయన విమర్శలు గుప్పించారు. భాజపాతో పొత్తు పెట్టుకోవడం వల్లే టీడీపీ గతంలో గెలిచిందని మోడీని దూషించడం వల్లే ఈ దఫా ప్రజలు టీడీపీని తిరస్కరించారని చెప్పుకొచ్చారాయన. తెరాస ప్రభుత్వం ముందస్తుకు వెళ్లడం వల్ల బ్రతికి పోయిందని లేదంటే ఆ పార్టీకో కూడా ఇదే గతిపట్టేదని విమర్శలు చేశారు. కేసీఆర్ ముందస్తుకు వెళ్లని పక్షంలో భారీ మూల్యం చెల్లించుకునే వారని, మరో దఫా సీఎం అయ్యే అవకాశమే ఉండేది కాదని ఆయన విమర్శించారు.