ఎపిలో గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష వాయిదా 

ఆంధ్రప్రదేశ్‌ గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్ష వాయిదా పడింది. తొలుత ఇచ్చిన ప్రకటన మేరకు జులై 28న మెయిన్స్ పరీక్ష నిర్వహించాల్సి ఉంది. అయితే అడ్మినిస్ట్రేటివ్ కారణాలతో పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ఏపీపీఎస్సీ తన ప్రకటనలో పేర్కొంది. పరీక్ష ఎప్పుడు నిర్వహించేది త్వరలో ప్రకటిస్తామని పేర్కొంది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 28న గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష ఉంది. ఏప్రిల్‌లో గ్రూప్-2 ప్రిలిమ్స్ ఫలితాలు వచ్చాయి. మెయిన్స్‌కు 92 వేలమంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు.

అయితే సిలబస్‌లో మార్పులు, ఎన్నికల ప్రక్రియ కారణంగా పరీక్షలకు పూర్తిస్థాయిలో సన్నద్ధం కాలేదని, కాబట్టి పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థుల నుంచి డిమాండ్లు వచ్చాయి. నిరుద్యోగుల అభ్యర్థన దృష్ట్యా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది.