‘పల్లె పండుగ’ ప్రారంభం!

పల్లె పండుగ  పంచాయతీ వారోత్సవాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృష్ణాజిల్లా కంకిపాడులో ప్రారంభించారు. పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాల్లో భాగంగా ఉపాధి హామీ నిధులతో రాష్ట్రవ్యాప్తంగా 4,500 కోట్ల ఖర్చుతో 30 వేల పనులు, 8 లక్షల కుటుంబాలకు ఉపాధి హామీ పథకం కింద వంద రోజుల పని దినాలు, 3 వేల కిలోమీటర్ల సీసీ రోడ్ల నిర్మాణం, 25 వేల గోకులాలు నిర్మించడం, 10 వేల ఎకరాల్లో నీటి సంరక్షణ కందకాల తవ్వకం పనులు చేస్తారు. ఈ పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు. 

అలాగే కంకిపాడు పంచాయతీలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 95.15 లక్షల అంచనా వ్యయంతో 11 అంతర్గత సిమెంటు రహదారులు, రెండు మినీ గోకులాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.పునాదిపాడు పంచాయతీలో 52 లక్షల అంచనా వ్యయంతో 2 అంతర్గత రహదారుల నిర్మాణం, 54 లక్షల అంచనా వ్యయంతో సామాజిక ఆరోగ్య కేంద్రం  ప్రహరీ నిర్మాణానికి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు.

 ఈ కార్యక్రమంలో రాష్ట్ర గనులు భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర, మచిలీపట్నం పార్లమెంటు సభ్యుడు వల్లభనేని బాలశౌరి, పెనమలూరు, గుడివాడ, పామర్రు, పెడన శాసనసభ్యులు బోడె ప్రసాద్, వెనిగండ్ల రాము,  వర్ల కుమార్ రాజా, కాగిత కృష్ణ ప్రసాద్, పలువురు అధికారులు పాల్గొన్నారు.