కుక్క కాటుకు చెప్పు దెబ్బ.. మోఢీనా మజాకా!
posted on May 7, 2025 4:41PM

భారత సైనిక దళాలకు చెందిన ఇద్దరు మహిళా అధికారులు ప్రపంచానికి శక్తివంతమైన సందేశం పంపారు. ఉగ్రమూడకలు వారికి అర్ధమయ్యే భాషలో గట్టి హెచ్చరిక చేశారు. దేశంలో మతసామరస్యం పరిఢ విల్లుతోందని ప్రపంచానికి చాటారు. ఎలాగంటే.. భారత సాయుధ దళాలు బుధవారం ( మే 7) తెల్లవారుజామున పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో మల్టిపుల్ టార్గెట్ లపై మెరుపుదాడులు నిర్వహించాయి. ఈ దాడులే ఆపరేషన్ సిందూర్. మొత్తం 9 టార్గెట్లను ఈ ఆపరేషన్ ద్వారా ధ్వంసం చేశాయి. ఈ దాడుల్లో దాదాపు 80 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. భారత దళాలు పాకిస్తాన్ గగనతలంలోకి ప్రవేశించకుండానే ఈ దాడులు నిర్వహించాయి. అలాగే పౌరలు, పాకిస్థాన్ ఆర్మీ పోస్టుల జోలికి పోకుండా కేవలం ఉగ్రవాద శిక్షణా శిబిరాలు, స్థావరాలను మాత్రమే లక్ష్యంగా ఎంచుకుని భారత సైన్యం ఈ దాడులను నిర్వహించింది.
పహల్గాం ఉగ్రదాడికి దీటైన బదులుగా ఈ దాడులు నిలిచాయనడంలో సందేహం లేదు. దాడుల అనంతరం వివరాలు తెలియజేయడానికి ఏర్పాటు చేసిన సమావేశంలో విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీతో పాటు భారత ఆర్మీకి చెందిన ఇద్దరు మహిళా అధికారులు పాల్గొన్నారు. ఆ ఇద్దరు మహిళా అధికారులే ఆపరేషన్ సిందూర్ పై మీడియాకు బ్రీఫింగ్ ఇచ్చారు. వారిద్దరూ కల్నల్ సోఫియా ఖురేషి, భారత వైమానిక దళానికి చెందిన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. ఆపరేషన్ సిందూర్ కు సంబంధించిన వివరాలను మీడియాకు తెలియజేయడానికి ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి ఇద్దరు మహిళా అధికారులు నాయకత్వం వహించడం ద్వారా ప్రపంచ దేశాలకు అత్యంత శక్తిమంతమైన, అద్భుతమైన సందేశాన్ని ఇచ్చినట్లైంది.
పహల్గాం ఉగ్రదాడిలో ఉగ్రవాదులు ఒక మహిళ భర్తను ఆమె కళ్ల ముందే చంపేసి.. మోడీకి చెప్పుకో మంటూ ఆమెను గేలి చేశారు. అటువంటి ముష్కరులకు భారత్ ఇద్దరు మహిళల చేత వారికి అర్ధమయ్యే భాషలో బుద్ధి చెప్పింది. అలాగే భారత్ లో మైనారిటీలకు, మహిళలకు సముచిత గౌరవం ఉందన్న సందేశాన్ని కూడా చాటింది. ఎందుకంటే ఈ మహిళా అధికారులు ఇరువురూ కూడా మైనారిటీ మతాలకు చెందిన వారే. ఇరువురిలో ఒకరు ముస్లిం, మరొకరు సిక్కు . ఈ విధంగా కూడా దేశంలో మైనారిటీలకు పూర్తి భద్రత ఉందనీ, వారికి ప్రాధా న్యత ఇస్తున్నామనీ భారత్ చాటింది. అంతే కాకుండా భారత్ లో మత సామరస్యం పరిఢవిల్లుతోందన్న సందేశాన్ని ఇచ్చింది. ఇక మీడియా సమావేశంలో వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కల్నల్ సోఫియా ఖురేషి పాకిస్తాన్ దుస్సాహసాలకు ప్రతిస్పందించడానికి, ఎదుర్కొని పీచమణచడానికీ భారత సాయుధ దళాలు పూర్తిగా సిద్ధంగా ఉన్నాయని హెచ్చరించారు.
నేడు పాకిస్తాన్ ఉగ్రవాదం పై భారత్ జరిపిన ఆపరేషన్ సిందూర్ లో సైన్యం ప్రదర్శించిన తెగువను, చాకచక్యాన్ని దేశ ప్రజలందరూ అభినందిస్తున్నారు. అలాగే పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకు లందరూ కూడా భారత ప్రభుత్వానికి అండగా నిలుస్తూ తమ మద్దతు తెలుపుతున్నారు. పెహల్గాం ఉగ్ర దాడిలో ఆత్మబంధువులను కోల్పోయిన కుటుంబాలు భారత్ సైన్యానికి జిందాబాద్ కొడుతూ, తమ వారి మరణాలకు న్యాయం జరిగిందంటున్నాయి.