మహేష్ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్కిచ్చే అప్డేట్!

సూపర్ స్టార్ మహేష్ బాబు మాస్ ఎంటర్టైనర్ 'గుంటూరు కారం' సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. అయితే అదే సమయంలో పలు సినిమాలు విడుదలవుతుండటంతో.. గుంటూరు కారంకి కావాల్సినన్నిథియేటర్లు దొరుకుతాయా?, రికార్డు ఓపెనింగ్స్ సాధ్యమవుతుందా? అనే ఆందోళన అభిమానుల్లో ఉంది. అయితే నిర్మాత నాగవంశీ మాత్రం ఎలాంటి ఆందోళన అక్కర్లేదని చెబుతున్నాడు.

ఇటీవల నాగవంశీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "ప్రతి ఏరియాలో రాజమౌళి గారి సినిమాల నెంబర్లకు దగ్గర్లో గుంటూరు కారం నెంబర్లు ఉంటాయి" అని చెప్పాడు. తాజాగా ఈ వీడియో క్లిప్ ని ట్విట్టర్ లో షేర్ చేసిన నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. "డియర్ సూపర్ ఫ్యాన్స్... మీకు మళ్ళీ స్ట్రాంగ్ గా చెబుతున్నా, మేము అదే మాట మీద ఉన్నాము. గుంటూరు కారంకి రికార్డు నెంబర్  ఆఫ్ థియేటర్స్ లో రికార్డు రిలీజ్ ఉంటుంది. రిలీజ్ మాకు వదిలేయండి, సెలెబ్రేషన్స్ ఏ మాత్రం తగ్గకుండా చూసుకునే బాధ్యత మీది" అని రాసుకొచ్చాడు. మొత్తానికి నాగవంశీ ట్వీట్ తో మహేష్ ఫ్యాన్స్ లో ఉత్సాహం రెట్టింపయింది.

త్రివిక్రమ్ దర్శకత్వంలో హారిక & హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.