కాళ్లు కడిగి పెన్షన్ ఇచ్చిన మంత్రి నిమ్మల రామానాయుడు
posted on Jul 1, 2024 2:01PM
వివాహంలో కన్యాదానం ప్రదాన తంతు. పెళ్లిలో వరుడి కాళ్లు వధువు తండ్రి కడగడం సంప్రదాయంగా వస్తోంది. కానీ ఎపిలో ఓ మంత్రి కాళ్లు కడిగి పెన్షన్ ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించారు. ఏపీలో పెన్షన్ల పంపిణీ జరుగుతోంది. మంత్రి నిమ్మల రామానాయుడు పశ్చిమగోదావరి జిల్లా యలమంచలీ మండలం అడవిపాలెంలో అనారోగ్యానికి గురయిన లారీ డ్రైవర్కు తొలి పింఛన్ అందించి కాళ్లకు నమస్కరించారు. ఇదే గ్రామానికి చెందిన పెదపాటి భాగ్యలక్ష్మి కాళ్లు కడిగారు మంత్రి. అలాగే పాలకొల్లులో లబ్ధిదారులకు నగదు అందజేశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తుందని మంత్రి తెలిపారు. టీడీపీ కూటమికి చారిత్రాత్మక విజయాన్ని అందించిన రాష్ట్ర ప్రజలకు రుణపడి ఉంటామన్నారు.
ఈ క్రమంలో ఆయన వృద్ధులు, వికలాంగుల కాళ్లు కడిగారు. ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఇక ప్రతి నెల పెరిగిన పెన్షన్ లబ్ధిదారుల ఇంటికి చేరుతుందన్నారు. కాగా, సీఎం చంద్రబాబు ‘ఎన్టీఆర్ భరోసా’ సామాజిక పింఛన్ల పంపిణీని సోమవారం ఉదయం ప్రారంభించిన విషయం తెలిసిందే. మంగళగిరి నియోజకవర్గంలోని పెనుమాకలో లబ్ధిదారు ఇంటికి వెళ్లి స్వయంగా తన చేతుల మీదుగా పెన్షన్ అందజేశారు. పెన్షన్ రూ.4 వేలతో పాటు, ఏప్రిల్ నుంచి మూడు నెలల పెంపు రూ.3 వేలతో కలిపి మొత్తం రూ.7 వేలు అందజేశారు.