బంధువు పెళ్ళికి వెళ్లి కరోడ్ పతి అయ్యాడు.. లక్ కలిసొస్తే అంతే...

ప్రతి వ్యక్తి జీవితంలో అదృష్టం ఏదో ఒక సమయంలో ఎదో ఒక రూపంలో తలుపు కొడుతుందని చెబుతూరు మన పెద్దలు. తాజాగా కర్ణాటకకు చెందిన ఒక యువకుడికి ఇలాగె అనుకోని అదృష్టం తలుపుతట్టింది. బంధువుల ఇంట్లో పెళ్లికి పక్క రాష్ట్రానికి వెళ్లి.. మరీ కోటీశ్వరుడయ్యాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే...  కర్ణాటకలోని మాండ్య జిల్లాలోని సోమనహళ్ళి గ్రామానికి చెందిన సోహాన్‌ బలరామ్ అనే యువకుడికి కేరళలో ఏకంగా రూ.కోటి లాటరీ తగిలింది. సోహాన్ ఈ నెల 5వ తేదీన తన కుటుంబంతో కలిసి బంధువుల పెళ్లి కోసం కేరళకు వెళ్లాడు. అక్కడ శుభకార్యానికి హాజరై.. తరువాత తన స్నేహితుడు దేవదాసు ప్రభాకర్‌ ఇంటికి వెళ్లాడు. స్నేహితుల బలవంతంపై తనకు ఇష్టం లేకపాయినా.. దేవదాసు దుకాణంలో ఉన్న కేరళ భాగ్యమిత్ర లాటరీ టికెట్‌ను రూ.100 పెట్టి కొన్న సోహన్.. కుటుంబంతో కలిసి కారులో మాండ్య కు బయల్దేరాడు. మధ్యాహ్నం 3.30 సమయంలో సోహన్ మొబైల్‌కు ఫోన్‌ వచ్చింది. నువ్వు కొన్న టికెట్‌కు రూ. 1 కోటి లాటరీ వచ్చిందని ఫ్రెండ్ చెప్పడంతో అతడు ఏదో తమాషా చేస్తున్నాడు అనుకున్నాడు. కానీ మళ్లీ మరో కాల్ చేసిన ఫ్రెండ్ వెంటనే టికెట్‌ తీసుకుని వెనక్కు రా అని ఒత్తిడి చేయడంతో దారిలోనే వెనుదిరిగాడు. వెనక్కు వెళ్లిన సోహన్ డ్రాలో వచ్చిన నంబర్‌ చూసుకుంటే నిజంగానే అతడి టికెట్ కు లాటరీ తగిలింది.దీంతో సోహన్ సంతోషం పట్టలేక స్వీట్లు కొని పంచిపెట్టాడు. అంతేకాకుండా లాటరీలో వచ్చిన డబ్బుతో తమకు వారసత్వంగా ఉన్న రైస్‌మిల్‌ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటామని తెలిపాడు. తాజాగా సోషల్ మీడియాలో అతడి పేరు ఇప్పుడు మార్మోగిపోతోంది.