భూదాన్ భూముల వివాదం సోదాలపై ఈడీ కీలక ప్రకటన
posted on Apr 29, 2025 8:12PM
.webp)
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నాగారంలో భుదాన్ భూములు వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకున్నది. ముగ్గురు ఐపీఎస్ అధికారులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఇదే అంశంపై ఈ నెల 24న విచారణ చేపట్టిన న్యాయస్థానం..27 మంది అధికారులకు చెందిన భూములను నిషేధిత జాబితాలో పెట్టాలని ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ భాస్కర్రెడ్డి సింగిల్ బెంచ్ ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ తాజాగా కొందరు ఐపీఎస్ అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. వీరిలో ఐపీఎస్లు మహేశ్భగవత్, స్వాతి లక్రా, సౌమ్యా మిశ్రా ఉన్నారు. భూదాన్ భూముల్లో అక్రమాలపై విచారణ చేపట్టాలని గవర్నమెంట్లో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడంతో సీబీఐ, ఈడీలతో దర్యాప్తు చేయించాలని కోరుతూ మహేశ్వరం మండలానికి చెందిన బిర్ల మల్లేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ సి.వి.భాస్కర్రెడ్డి ఏప్రిల్ 24న విచారణ చేపట్టారు.
నాగారంలోని 181, 182 సర్వే నెంబర్లో సుమారు 103 ఎకరాల భూదాన్ భూమి ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ భూమిపై గత కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. ఇందులో అక్రమాలు జరిగాయని ఓ వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు బినామీ పేర్లతో రిజిస్ట్రేషన్ చేసుకున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. ప్రతివాదులుగా ప్రభుత్వంతోపాటు పలువురు ఐఏఎస్లు, ఐపీఎస్లు, వారి భార్యలు, పిల్లలను ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. విచారణ అనంతరం ప్రభుత్వం, సీబీఐ, ఈడీతోపాటు ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు. అయితే తాజాగా ముగ్గురు ఐపీఎస్లు హైకోర్టును ఆశ్రయించడం హాట్ టాపిక్గా మారింది. మరోవైపు ఈ అంశంలో పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఈడీ అధికారులు సైతం దర్యాప్తు కొనసాగిస్తున్నారు.