ఐపీఎల్ కు కరీంనగర్ ప్లేయర్ అమన్ రావు
posted on Dec 17, 2025 9:49AM

కరీంనగర్ జిల్లాకు చెందిన యువ క్రికెటర్ పేరాల అమన్రావు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చోటు దక్కించుకున్నాడు. మంగళవారం జరిగిన వేలంలో 21 ఏళ్ల అమన్రావును రూ. 30 లక్షలకు రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది. జిల్లా యువకుడు ప్రతిష్ఠాత్మక టోర్నీకి ఎంపిక కావడం పట్ల స్థానికంగా హర్షం వ్యక్తం అవుతోంది. హైదరాబాద్ అండర్ 23 రంజీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న అమన్రావు ఇటీవల జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ టోర్నీలో 160 స్ట్రైక్ రేట్తో రెండు అర్ధ సెంచరీలు సాధించి ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించాడు. అమన్రావుది క్రీడా, రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం.
అమన్ రావు తండ్రి పేరాల మధుసూదన్రావు గతంలో జిల్లా స్థాయి క్రికెటర్గా ఆడారు. ఆయన తాత పేరాల గోపాల్రావు జిల్లా పరిషత్ వైస్ ఛైర్మన్గా పనిచేశారు.అమన్ రావు స్వగ్రామం సైదాపూర్ మండలం వెన్నంపల్లి కాగా, కొన్నేళ్లుగా వీరి కుటుంబం హైదరాబాద్లో స్థిరపడింది. టాప్ ఆర్డర్ అటాకింగ్ బ్యాట్స్మెన్ అయిన అమన్రావు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, అండర్-19, అండర్-23లో మంచి ప్రతిభ కనబరిచాడు. అయినా దుబాయ్ లో జరిగే వేలంలో పాల్గొనేందుకు అమన్ రావు వద్ద పాస్ పోర్టు కూడా లేకపోవడంతో, విషయం తెలుసుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ చొరవ తీసుకుని తనకు పాస్ పోర్టు జారీ చేయించారు. దీంతో అమన్ రావు ఐపీఎల్ వేలంలో పాల్గొనగలిగారు.