ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి షాక్.. 'గరుడ'ను మహేష్ తో చేస్తున్న రాజమౌళి!

'బాహుబలి' ఫ్రాంచైజ్ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి.. జూనియర్ ఎన్టీఆర్ తో 'గరుడ' అనే భారీ బడ్జెట్ చేయాలనుకున్నాడు. 'ఎన్టీఆర్, రాజమౌళి కాంబోలో గరుడ' అనే వార్త అప్పట్లో మారుమోగిపోయింది. రాజమౌళి సైతం 'బాహుబలి' తర్వాత 'గరుడ' చేసే ఆలోచన ఉందని అప్పట్లో చెప్పాడు. కానీ ఆ ఎందుకనో ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. ఆ స్థానంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా 'ఆర్ఆర్ఆర్' అనే మల్టీస్టారర్ చేశాడు రాజమౌళి. దీంతో 'గరుడ' గురించి అందరూ మర్చిపోయారు. ప్రస్తుతం రాజమౌళి తన తదుపరి సినిమాని మహేష్ బాబుతో చేయడానికి సిద్ధమవుతున్నాడు. అయితే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది. (SSMB 29)

మహేష్ బాబు హీరోగా రాజమౌళి చేయనున్న ప్రాజెక్ట్.. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ గా రూపొందనుందని ముందు నుంచి వినిపిస్తున్న మాట. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి కొత్త ప్రచారం మొదలైంది. అప్పుడు ఎన్టీఆర్ తో చేయాలనున్న 'గరుడ'నే.. ఇప్పుడు మహేష్ తో రాజమౌళి చేస్తున్నాడని న్యూస్ వినిపిస్తోంది. ఓ రకంగా ఇది సర్ ప్రైజ్ న్యూస్ అని చెప్పవచ్చు. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాల్సి ఉంది. 

కాగా, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న మహేష్-రాజమౌళి ప్రాజెక్ట్.. వచ్చే ఏడాది జనవరిలో సెట్స్ పైకి వెళ్లే అవకాశముంది అంటున్నారు.