Eto Vellipoyindhi Manasu : భార్య దొంగతనం చేయలేదని నిరూపించకోగలదా.. భర్త మౌనంపై సందేహం!

 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -139 లో.. నువ్వు ఇంకా ఇక్కడే ఉంటే దీన్ని వాళ్లు అవకాశంగా వాడుకుంటారు.. వెళ్లిపో నాన్న అని రామాలక్ష్మి, ధన కలిసి మాణిక్యానికి చెప్తారు. దాంతో మాణిక్యం వెళ్ళిపోతాడు. ఈ ప్రాబ్లమ్ నుండి ఎలా బయటపడతావని రామలక్ష్మితో ధన అంటాడు. మరొకవైపు సీతాకాంత్ జరిగిన దానిని గుర్తుకు చేసుకుంటాడు. అప్పుడే సిరి, పెద్దాయన.. సీతాకాంత్ దగ్గరికి వస్తారు. ఏంటి సీతా నగలు పోవడమేంటి? ఆ నింద రామలక్ష్మి పైన పడడమేంటి? అందరూ రామలక్ష్మిని దొంగ అంటుంటే మాత్రం భరించలేని బాధగా ఉందని పెద్దాయన అంటాడు.

 

వదిన తప్పు చేయదని తెలుసు.. వదిన పైన అంత పెద్ద నింద పడ్డప్పుడు ఎందుకు సైలెంట్ గా ఉన్నావని సిరి అంటుంది. ఆ క్షణం లో నువ్వు నీ భార్యకి అండగా నిలబడాలి.. తప్పు చెయ్యదని బలంగా మాట్లాడాలి కానీ నువ్వు అలా సైలెంట్ గా ఉంటే నువ్వు కూడా నమ్మలేదని రామలక్ష్మి బాధపడదా అని పెద్దాయన అంటాడు. తెలుసు తాతయ్య రామలక్ష్మి బాధపడుతుంది.. బాధపడిందని తెలుసు.. తను దొంగతనం చేయలేదని కూడా తెలుసని సీతాకాంత్ అంటాడు. మరి ఇదే మాటని అందరి ముందు ఎందుకు చెప్పలేదని సిరి అంటుంది. అక్కడున్న ఆధారాలన్ని రామలక్ష్మి  దోషిగా చూపిస్తున్నాయి. అప్పుడు తనకంటే నేనే బాధ పడ్డాను. తను కచ్చితంగా దొంగతనం చేయలేదని నిరూపించుకుంటుందని సీతాకాంత్ అంటాడు. నిరూపించుకోకపోతే ఇంట్లో నుండి వెళ్ళిపోతానని అంది..  అదే భయంగా ఉందని సిరి అంటుంది. ఆ తర్వాత సీతాకాంత్ గదిలో ఉండగా.. రామలక్ష్మి వస్తుంది. నాతో మాట్లాడడం లేదు కోపంగా ఉందని సీతాకాంత్ అనుకుంటాడు.

 

నేను నిజంగానే దొంగతనం చేసానని సీతా సర్ అనుకుంటున్నారు.. అందుకే మాట్లాడడం లేదని రామలక్ష్మి అనుకుంటుంది. మరొకవైపు శ్రీలత దగ్గరికి శ్రీవల్లి వచ్చి.. చూసారా ఈ వీడియో ఎంత బాగా పని చేసిందోనని అంటుంది. దేని గురించి ఆలోచిస్తున్నారని శ్రీలతని శ్రీవల్లి అడుగుతుంది. రామలక్ష్మి దొంగతనం చెయ్యకపోతే అసలు ఆ నగలు ఎవరు తీశారంటావని శ్రీలత అంటుంది. సందీప్ తడబడుతూ మాట్లాడిన మాటలు గుర్తుకుచేసుకొని సందీప్ దగ్గరికి వెళ్లి నువ్వే కదా దొంగతనం చేసిందని అడుగుతుంది. నేనే అని మల్లేష్ అప్పు గురించి చెప్తాడు సందీప్. ఇప్పుడు రామలక్ష్మి నువ్వే దొంగతనం చేసావని నిరూపిస్తే పరిస్థితి ఏంటని శ్రీలత అనగానే.. మా వారే దొంగతనం చేశారనడనికి సాక్ష్యాలు లేవని శ్రీవల్లి అంటుంది. రేపు రామలక్ష్మి నగలు ఎవరు తీసారో కనిపెట్టకుంటే.. ఇంట్లో నుండి వెళ్ళిపోతుందని శ్రీలత అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.