ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. దేశంలో ఇదే మొదటి సారి

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. అసెంబ్లీ సమావేశాలకు ముందు గవర్నర్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించడం సంప్రదాయం. అయితే ఈ సారి కరోనా మహమ్మారి నేపథ్యంలో గవర్నర్ రాజ్‌భవన్ నుంచే వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. ఇలా ఒక గవర్నర్ ఆన్‌లైన్ ద్వారా అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించడం దేశంలో ఇదే మొదటి సారి అని చెబుతున్నారు. 

గవర్నర్ తన ప్రసంగంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసించారు. ఎన్నో సంక్షేమ పథకాలను ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తూ, ఏడాది వ్యవధిలోనే అన్ని వర్గాల ప్రజలకూ దగ్గరైందని తెలిపారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 8.16శాతం వృద్ధి రేటు సాధించినందుకు సంతోషంగా ఉందన్నారు. వ్యవసాయ, అనుబంధం రంగాల్లో 8శాతం వృద్ధి రేటు సాధించామని తెలిపారు. పారిశ్రామిక రంగంలో 5శాతం వృద్ధిరేటు నమోదయ్యిందని చెప్పారు. పిల్లల చదువు, తల్లుల సంక్షేమం కోసం అమ్మఒడి పథకాన్ని ప్రారంభించాం. నాడు-నేడు మనబడి కార్యక్రమం కింద.. మూడేళ్లలో 48వేల పాఠశాలలను ఆధునికీకరిస్తాం. ఆరోగ్యశ్రీ పథకం కింద 6.25 లక్షల మందికి లబ్ధి చేకూరిందని గవర్నర్ పేర్కొన్నారు.

కాగా, గవర్నర్ ప్రసంగం తరువాత మధ్యాహ్నం ఒంటి గంటకు ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. మరోవైపు, ఈ సమావేశానికి టీడీపీ ఎమ్మెల్యేలు నల్ల చొక్కాలతో హాజరయ్యారు.