ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరు కాలేను: సీఎం జగన్

ఈ రోజు, రేపు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లతో ప్రధాని మోడీ మాట్లాడనున్నారు. రేపు మధ్యాహ్నం కొందరు ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. 

అయితే, ఈ వీడియో కాన్ఫరెన్స్ కి తాను హాజరు కాలేనని ఏపీ సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయానికి ఆయన సమాచారం పంపారు. తమ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయని, కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ సమావేశాలను సాధ్యమైనంత త్వరగా ముగించాల్సి వుందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా తాను సభలో ఉండటం తప్పనిసరైన నేపథ్యంలో ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనలేనని సీఎం జగన్ తెలిపినట్లు సమాచారం.