వెనక నుంచి ఢీ కొన్న లారీ... ఎమ్మెల్యే పాయల్ శంకర్ కు తృటిలో తప్పిన ప్రమాదం

ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తృటిలో ప్రమాదం తప్పింది.   హైదరాబాద్ నుండి ఆదిలాబాద్ కు వెళ్తున్న పాయల్ శంకర్ కారును, వెనుక నుండి వచ్చిన ఓ లారీ వేగంగా ఢీకొట్టింది. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం పద్మాజీవాడ వద్ద శుక్రవారం (అక్టోబర్ 25) ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో ఎమ్మెల్యే కారు ధ్వంసం కాగా.. పాయల్ శంకర్ స్వల్పంగా గాయపడ్డారు.   అనంతరం ఎమ్మెల్యే వేరే కారులో ఆదిలాబాద్ కు పయనమయ్యారు.  

ఎమ్మెల్యే ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే లారీ వెనుక నుంచి వేగంగా వచ్చి ఎమ్మెల్యే కారును ఢీ కొట్టిన తీరు అనుమానాలకు తావిస్తోంది. ఎమ్మెల్యే హత్యకు కుట్ర జరిగిందా అన్న సందేహాలు పాయల్ శంకర్ అనుచరులు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తున్నారు.