సొంత ప్రభుత్వం నుండే ఆప్ కు చిక్కులు.. అద్దె చెల్లించాలని నోటీసులు
posted on Jun 15, 2017 3:10PM
.jpg)
ఆప్ పార్టీకి సొంత పార్టీ నేతల నుండే కాదు.. సొంత ప్రభుత్వం నుండి కూడా చిక్కులు ఎదురవుతున్నాయి. అద్దె కట్టకుండా ప్రభుత్వ భవనంలో పార్టీ కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారంటూ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాల ప్రకారం...ఆప్ పార్టీ ప్రభుత్వ భవనంలో పార్టీ కార్యాలయాన్ని నిర్వహిస్తుంది. అయితే ఆప్ నేతలు అద్దె మాత్రం కట్టడంలేదు. ఈ నేపథ్యంలో వెంటనే రూ. 27లక్షల అద్దె చెల్లించి భవనాన్ని ఖాళీ చేయాలని ఆమ్ఆద్మీ పార్టీకి పీడబ్యూడీ నోటీసులు జారీ చేసింది. భవనం లైసెన్సు ఫీజు కన్నా ఈ మొత్తం 65రెట్లు ఎక్కువ. అంతేగాక, అద్దె చెల్లించకపోతే.. దాన్ని మరింత పెంచుతామని అధికారులు స్పష్టం చేశారు. ఈ విషయమై గత ఏప్రిల్లోనే దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు నోటీసులు అందాయి. నిబంధనలకు విరుద్ధంగా భవనాన్ని ఆమ్ ఆద్మీ పార్టీకి కార్యాలయానికి కేటాయించారని, వెంటనే ఖాళీ చేయాలని అప్పట్లో అధికారులు ఆదేశించారు. కాగా.. దిల్లీ లెఫ్ట్నెంట్ గవర్నర్ అనిల్ బైజల్ ఈ భవన కేటాయింపును రద్దు చేసినట్లు తెలుస్తోంది. ఈ భవనాన్ని దిల్లీ మాజీ మంత్రి ఆసిమ్ అహ్మద్ఖాన్కు కేటాయించారు. అయితే అవినీతి ఆరోపణల కింద ఆయన పదవి నుంచి తొలగిపోవడంతో బంగ్లాను ఖాళీ చేశారు. అప్పటి నుంచి ఆ భవనాన్ని ఆప్ పార్టీ ఆఫీస్గా మార్చారు.