తిరుపతి శ్రీ కోదండ రామాలయం మీకు తెలుసా?
కోదండ రామాలయం తిరుపతిలోని ప్రముఖ ఆలయాల్లో ఒకటి. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధీనంలో నడుస్తుంది. దేవస్థానం రాకముందు మహంతుల పాలనలో ఉండేది. ధూపదీప నైవేద్యాలతో నిత్యం వేలాదిమంది భక్తులతో కళకళలాడే ఈ ఆలయం తిరుపతి మధ్యలో వెలసిన ఆలయం. ప్రతి సంవత్సరం మార్చి నెలలో కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. కోదండరామస్వామి ఆలయం మూడు అంతస్థుల రాజగోపురం మీద విజయనగర శిల్పులు అరుదుగా కనిపించే పశ్చిమవైపు ముఖద్వారం, ఆలయం చుట్టూ ఎత్తైన రాతి ప్రహారిగోడ గోపురం దాటి ఆలయమ్లోకి ప్రవేశించగానే బలిపీఠం, ధ్వజస్తంభం, ర్పదాన ఆలయం, గర్భగృహం అంతరాళం ఉంటాయి. ఎత్తైన అధిష్టానంపై అపురూప నిర్మాణం, ముఖమంటపం, మహా మంటపం, మంటప రాతి గోడలపై విజయనగర రాజచిహ్నాలు, బాలకృష్ణ, ఆంజనేయ, బలరామ, లక్ష్మీ, వాలి సుగ్రీవ శిల్పాలు, గర్భాలయంలో స్వామికి ఎదురుగా గరుడ మంటపం ఉంటాయి. గరుడ మంటపంలో గరుత్మంతుడు నమస్కరిస్తున్నట్టు ఉంటుంది. గర్భగృహ ఆలయం ముందు ఇరుపక్కలా జయవిజయులు ఉంటారు. గర్భ ఆలయంలో సుందరమైన కోదండరాముడి విగ్రహంతో పాటు కుడివైపు సీతాదేవి విగ్రహం, ఎడమవైపు లక్ష్మణస్వామి విగ్రహం ఉంటాయి. కోదండాలను కలిగి ఉన్న రామలక్ష్మణుల ప్రత్యేకత ఏమిటంటే సామికి ఎడమవైపు కాకుండా సీతమ్మ విగ్రహం కుడివైపున ఉండడం. మూలమూర్తులకు ముందు స్వామిని సేవిస్తున్నట్టు ఉండే ఆంజనేయస్వామి విగ్రహం పంచలోహాలతో తయారైనది.
ఆలయ చరిత్ర :
క్రీ.శ. 1480లో సాళువ నరసింహరాయల గౌరవార్థం ఈ ఆలయాన్ని తిరుపతికి చెందిన శఠగోప దాసర్ నరసింహరాయ మొదలి అనే వ్యాపారి నిర్మించి విగ్రహాలను ప్రతిష్టించాడు. అలాగే క్రీ.శ. 1530 జనవరి 14వ తేదీన అచ్యుత దేవరాయల గౌరవార్థం కుమారా రామానుజయ్యంగార్ ఒక కొయ్య తేరును నిర్మించి బ్రహ్మోత్సవాలలో వాడుకోవడానికి సమర్పించాడని చరిత్ర ద్వారా తెలుస్తుంది.అలాగే గుడిముందు కొయ్యతేరు , తేరు మంటపం శిల్పాలతో నిర్మించాడు. ఆలయానికి ఎదురుగా చిన్న అంగడి వీధిలోని ఆంజనేయస్వామి ఆలయంలో విగ్రహం పెద్దదే కాదు, ఎంతో అరుదైనది. అచ్యుత దేవాలయాల అంగరక్షకుడు, పెనుగొండ వాసి, లేపాక్షి శిల్ప సంపాదకు కారకుడైన విరూపన్న ఈ ఆలయాన్నినారాయనవనం కళ్యాణ వెంకటేశ్వర ఆలయమ్తో పాటు క్రీ.శ. 1540 జీర్ణోద్దరణ చేసినట్టు కనిపిస్తుంది. ఈ ఆలయ ప్రతిష్టాపన సందర్భంగా పూజలు చేయడానికి ఉదయగిరి నుండి బ్రాహ్మణులను తీసుకుని వచ్చారట. వీరినే ఉదయగిరి బ్రాహ్మణులు అంటారు. అనేకమంది రాజులు, ధనవంతులు ఈ ఆలయానికి ఎన్నో కైంకర్యాలు, ఇతర దానాలు చేశారు. క్రీ.శ. 1497లో పెరియ పెరుమాళ్ దాసర్ అనే ఏకాంగి గుడిలోపల 1200 పణాలను సమకూర్చినట్టు శాసనాల ద్వారా తెలుస్తుంది.
క్రీ.శ. 1547లోని శాసనం ప్రకారం విజయనగర సదాశివరాయలు అనే రాజు ఆలయ నిర్వహణకు ఎన్నో దానాలు చేశాడు. అన్నమయ్య మనువడు అయిన తాళ్ళపాక చిన్న తిరుమలయ్య ఒక ఉత్సవంలో రాములవారికి "తిరుప్పళి ఓడమ్'' అనే ఇడ్లీ నైవేద్యాన్ని ఏర్పాటు చేశాడు. అప్పుడప్పుడు గోవిందరాజస్వామి శేష వాహనంపై వచ్చి ఈ రాములవారి గుడిలో మర్యాదలు పొంది తిరిగి తన ఆలయానికి వెళ్తుంటారు. కృతయుగంలో శ్రీరాముడు వానర సైన్యంతో తిరుమలకు వచ్చాడట. శ్రీవారి ఆనంద నిలయం దేదీప్యమానంగా వెలుగొందడం చూసి వానరులు శ్రీరాముడికి తెలియజేశారట. అదంతా తిరుమల కొండ ప్రభావం అని రాముడు వారికి చెప్పాడట. క్రీ.శ. 1801లో మిస్టర్ స్ట్రాటన్ అనే ఆంగ్లయుడు జిల్లాకు మొదటి కలెక్టర్ తిరుమల ఆలయ చరిత్ర, డానికి సంబంధించిన పురాణాలను, ఐతిహాహ్యాలను, ప్రశస్తిని, సంప్రదాయాలను స్థానికులైన ఆలయ నిర్వాహకుల నుండి సేకరించడానికి నలభై ప్రశ్నలతో ఒక ప్రశ్నావళిని రూపొందించాడట. అలా స్థానికుల నుండి వాటి జవాబులు రాబట్టి వాటిని ప్రచురించాడట. అదే "సవాల్-ఇ.జవాబ్''. రావణాసురుని సంహరించాక అయోధ్యకు వెళ్తూ తిరుపతిలో శ్రీరాముడు ఒక రాత్రి గడిపాడట. రాముడు రాకను పురస్కరించుకుని తిరుపతిలో కోదండరామాలయం వేలిసిందని "సవాల్-ఇ.జవాబ్''లో పేర్కొనబడి ఉంది. అదే కాకుండా కోదండరామస్వామి ఆలయాన్ని కలియుగంలో అరవై నాలుగువ సంవత్సరం జనమేజయుడు అనే రాజు ఆలయ గోపురం, మంటప ప్రాకారాలు నిర్మించాడని శాసనాల ద్వారా తెలుస్తుంది. యాదవ రాజులు వాటిని అభివృద్ధి చేశారని "సవాల్-ఇ.జవాబ్''లో ప్రస్తావించారట.