కృష్ణాజిల్లా, శ్రీకాకుళంలోని
ఆంద్ర మహావిష్ణువు ఆలయం
కృష్ణాజిల్లా, విజయవాడకు సుమారు 65 కిలోమీటర్ల దూరంలో ఘంటసాల మండలంలోని, దివిసీమలో కృష్ణానదీ తీరాన, శ్రీకాకుళం అనే గ్రామంలో ఆంద్ర మహావిష్ణువు ఆలయం వుంది.ఈ దేవాలయం చాలా ప్రాచీన ఆలయం అని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. ఇందులోని మహావిష్ణువు ఆంద్ర భాషా ప్రియుడని అంటారు. ఆ మహావిష్ణువుని ముందుగా బ్రహ్మ ప్రతిష్టించి పూజించాడు.
శ్రీకాకుళేశ్వరుడు అన్న పేరుతొ ప్రఖ్యాతి చెందాడు. ఇంకా ఈ స్వామివారిని ఆంద్ర విష్ణువు, ఆంధ్రనాయకుడు మొదలైన పేర్లతో కూడా పిలవబడ్డాడని పురాణాల ద్వారా తెలియజేస్తుంది. శ్రీకాకుళంలో స్వామివారు స్వయంభువుగా వెలిసి భక్తుల పాపాలను హరించి వారికి విముక్తి కలిగిస్తున్నాడని భక్తుల నమ్మకం.
అయిదు అంతస్థుల ఎత్తయిన రాజగోపురస్థంభం మీద ఉన్న శాసనం ద్వారా ఈ గోపురాన్ని చోళరాజైన అనంత దండపాలుడు శాలివాహన శకం 1081లో నిర్మించాడని తెలుస్తుంది. తరువాత శ్రీకృష్ణదేవరాయలు క్రీ.శ. 1519లో ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న మండపంలో కూర్చుని స్వామిని స్మరిస్తూ ఆముక్తమాల్యద గ్రంథాన్ని రచించాడని తెలుస్తుంది.
ఆ మండపాన్ని ఆముక్తమాల్యద మండపంగా పిలుస్తున్నారు. శ్రీకాకుళేశ్వరస్వామి ఆలయం మూడు భాగాలుగా ఉంటుంది. రంగమంటపం, అంతరాలయం, గర్భగుడి. రంగమంటపంలో నాలుగు స్తంభాల మధ్య నర్తకి నాట్యం చేయడానికి వీలుగా గుండ్రని వేదిక వుంటుంది. గర్భగుడిపై ఉన్న విమానానికి భద్రకోటి విమానం అని పేరు. ఆలయానికి తూర్పు, దక్షిణ గాలిగోపురాలు ఉన్నాయి. రంగమంటపంలో ఉత్తరాభిముఖంగా దక్షిణగోడలోని గూడులో భాగ్యలక్ష్మి అమ్మవారు దర్శనం ఇస్తారు.
అమ్మవారికి ఎదురుగా ఉత్తరపుగోడలో ఆంజనేయస్వామి విగ్రహం ఉంటుంది. స్వామివారి ఉత్తరభాగ ఉపాలయంలో భూసమేత చిన్నకేశవస్వామివారు కొలువై ఉన్నారు. ఈ ఆలయంలో నిత్యాగ్నిహోత్రం ఒక ప్రత్యేకత. ఏనాడో వెలిగించిన హోమగుండంలోని అగ్నిహోత్రం ఇప్పటికీ సంరక్షించబడటం ఆలయంలో కనిపిస్తుంది.
ఈ శ్రీకాకుల క్షేత్రం సాక్షాత్తూ బ్రహ్మదేవుని ప్రయత్నం మేరకే ఉద్భవించిందని మరొక పురాణ కథనం. చారిత్రకంగా కూడా ఎంతో ప్రాచీనమైన ఈ ఆలయం కాలగమనంతో దేవరకొండ (చల్లపల్లి) ప్రభువుల వశమైంది. వారి కాలంలో దేవాలయం ఎంతో వైభవాన్ని అనుభవించింది. శ్రీనాథుడు మొదలైన ఎందరో కవులు తమ కావ్యాలతో ఈ క్షేత్రాన్ని గురించి, స్వామియొక్క మహత్యం గురించి గొప్పగా వర్ణిస్తూ వ్రాశారు. విజయనగర పతనానంతరం ఈ పంతం అంతా గోల్కొండ నవాబుల పాలనలోకి వెళ్ళిపోయింది.
ఆ తరువాత దేవరకొండ ప్రభువు అయిన యార్లగడ్డ కోదండ రామన్న ఈ ఆలయాన్ని పునరుద్ధరించారని చరిత్ర. ఇప్పటికీ చల్లపల్లి జమీందారులైన యార్లగడ్డ వంశీయులే అనువంశిక ధర్మకర్తలు గా వ్యవహరిస్తున్నారు. వైకుంఠ ఏకాదశి రోజు శ్రీరాజ్యలక్ష్మీ సమేత శ్రీకాకుళేశ్వరస్వామిని ఉత్తరద్వార దర్శనం చేసుకుంటే పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది. ప్రతి ఏటా వైశాఖమాసంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.