ఈరోజు భౌమ ప్రదోషవ్రతం.. ఇలా చేస్తే ఈశ్వరుడితో పాటు హనుమంతుడు ప్రసన్నుడు అవుతాడు..!

ప్రతి మాసంలో వచ్చే ప్రతి త్రయోదశి తిథి పరమేశ్వరునికి ఎంతో ప్రత్యేకం. ఈ రోజును ప్రదోష వ్రతంగా పిలుస్తారు. త్రయోదశి తిథి మంగళవారం వచ్చినప్పుడు దీన్ని భౌమ ప్రదోష వ్రతం అని పిలుస్తారు. ఈరోజు పరమేశ్వరుడితో పాటు హనుమంతుడిని కూడా ప్రసన్నం చేసుకునే అవకాశం ఉంది. మంగళ ప్రదోష వ్రతం రోజు చేయాల్సింది ఏంటి? ఏం చేస్తే ఆ పరమేశ్వరుడు, పార్వతి తల్లి, హనుమంతుల ఆశీర్వాదం లభిస్తుంది. తెలుసుకుంటే..
ప్రదోష ఉపవాసం..
ప్రదోష వ్రతం రోజు ఉపవాసం ఉండటం మంచిది. ఇది చాలా ప్రయోజనాలు చేకూరుస్తుంది. పరమేశ్వరుడి ఆశీర్వాదంతో పాటు రుద్రావతారమైన హనుమంతుని ఆశీర్వాదం కూడా లభిస్తుంది. జాతకంలో కుజుడు బలవంతుడు అవుతాడు. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఆస్తి సంబంధ వివాదాలు, దుఃఖాలు, బాధలు తొలగిపోతాయి. అయితే ఈ రోజు భౌమ ప్రదోష ఉపవాసం కథను వినాలి లేదా చదవాలి. ఆ కథ ఈ కింది విధంగా ఉంది.
మంగళవారం వ్యాధులను నాశనం చేసే రోజు. ఈ ఉపవాసంలో, ఉపవాసం ఉన్న వ్యక్తి ఒకసారి గోధుమలు, బెల్లం తినాలి. ఈ ఉపవాసం ఆచరించడం ద్వారా, ఒక వ్యక్తి అన్ని పాపాలు, వ్యాధుల నుండి విముక్తి పొందుతాడట. ఇందులో ఎటువంటి సందేహం లేదని పండితులు, పురాణాలు చెబుతున్నాయి. దీనికి సంబంధించి చాలా కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి.
మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి ఎంతో ముఖ్యమైన రోజు. ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామిని కూడా ప్రత్యేకంగా పూజించవచ్చు. అలాగే సాయంత్రం ప్రదోష సమయంలో శివలింగం ఆరాధన, శివలింగానికి అభిషేకం, బిల్వపత్రాల సమర్పణ చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు భౌమ ప్రదోష వ్రతాన్ని తప్పకుండా చేయాలని చెబుతారు. దీని వల్ల ఆరోగ్యం కుదుటపడుతుంది.
*రూపశ్రీ.



