ఆషాఢ అమావాస్య.. ఆ రోజే భీముని అమావాస్య నోము.. దీని గురించి తెలుసా!

భీముని అమావాస్య నోము మహాభారతంతో సంబంధం కలిగి ఉంది. వనవాస సమయంలో పాండవులు అరణ్యంలో ఉండేవారని తెలిసిందే. . అక్కడ బకాసురుడనే రాక్షసుడు ప్రజలను భయపెడుతూ, ప్రతి నెలా ఒక మనిషిని తినేవాడు. లేకపోతే గ్రామాల మీద పడి చేతికి దొరికిన వాళ్లను దొరికినట్టు తినేవాడు. దీంతో నెలకు ఒక మనిషిని అతనికి ఆహారంగా ప్రజలే పంపేవారు. ఒకరోజు బకాసురుడికి భోజనం కోసం ఒక కుర్రాడి వంతు రాగా ఆ కుటుంబం శోకంలో మునిగిపోయింది. అప్పుడు భీముడు ముందుకు వచ్చాడు. బకాసురుడిని చంపడానికి సిద్ధమయ్యాడు. అయితే శక్తిని, బలాన్ని, శివుడి ఆశీర్వాదాన్ని పొందాలని ఒక నోము చేశాడు .. అదే భీముని అమావాస్య నోముగా ప్రసిద్ధి పొందింది.
అమావాస్య రోజున, భీముడు ఉపవాసం ఉండి, శివుని పూజ చేసి, ఆత్మశుద్ధితో బకాసురుని సంహరించాడు. ఆనాటినుంచి ఈ నోమును బలమైన భర్త కోసం, కుటుంబ సంక్షేమం కోసం చేయడం మొదలైంది.అంతేకాదు.. అమావాస్య రోజునే పరమేశ్వరుడు పార్వతీ మాతను భార్యగా స్వీకరించాడని, ఈ రోజున పార్వతీ పరమేశ్వరులను భక్తితో పూజించడం వల్ల భర్తకు దీర్ఘాయువు, వైవాహిక జీవితంలో సంతోషం చేకూరతాయట. ఈ నోమును వివాహం అయిన వారు భర్త ఆరోగ్యం, భర్త సంతోషం, భర్త బాగుండాలని చేసుకుంటే.. వివాహం కాని అమ్మాయిలు మంచి భర్త రావాలని చేసుకుంటారు.
నోము చేసే విధానం..
వ్రతం ముందు రోజు :
ఇంటిని శుభ్రపరచాలి.
పూజా సామాగ్రిని సిద్ధం చేసుకోవాలి. (కొబ్బరికాయలు, పళ్ళు, పూలు, దీపం, నెయ్యి, పంచామృతం, అక్షతలు, తాంబూలం, ప్రసాదం కోసం రవ్వలడ్డూ లేదా చక్కెర పొంగలి).
వ్రతం రోజున (అమావాస్య):
తెల్లవారు జామునే లేచి స్నానమాచరించి, శుద్ధంగా ఉండాలి.
గౌరీదేవిని లేదా శివపార్వతులను పూజిస్తారు.
భీముని చిత్రాన్ని లేదా రూపాన్ని కొలుస్తారు. లేకపోతే శివలింగాన్ని పూజిస్తారు.
"భీముని అమావాస్య నోముకథ" చదవడం లేదా వినడం తప్పనిసరి.
వ్రతం చేసేటప్పుడు ఒక గిన్నెలో కొబ్బరికాయ మీద తాడిపత్తి ఆకుతో మలచిన తోరణం పెడతారు — దీన్ని "భీముని ఆకారంగా" భావిస్తారు.
"భీమా, భీమా, బకాసురుడిని నీవే సంహరించావు" అంటూ ప్రార్థన చేస్తారు.
ప్రసాదంగా చక్కెర పొంగలి, గోధుమల అప్పాలు లేదా రవ్వలడ్డూ తయారుచేసి నివేదిస్తారు.
5, 7 లేదా 11 మంది స్త్రీలకు వ్రత బంధువులుగా పిలిచి, వాయనం ఇస్తారు (కొబ్బరికాయ, తాంబూలం, బ్లౌజ్ పీస్, పళ్ళు, లడ్డూ వంటివి).
సాయంకాలం:
తిరిగి దీపారాధన చేసి, పూజను ముగిస్తారు.
భోజనం చేసేప్పుడు వ్రతనియమాలను పాటిస్తారు.
ఇది ఒక శక్తివంతమైన వ్రతంగా పరిగణించబడుతుంది. భర్తకు దీర్ఘాయుష్షు, కుటుంబానికి శాంతి, సమృద్ధి కలుగుతాయని నమ్మకం.
ఈ నోమును వివాహం అయిన మహిళలు తప్పనిసరిగా ఆచరిస్తారు. శివుని అనుగ్రహంతో అశుభ శక్తులు తొలగిపోతాయి, దుఃఖాలు నశిస్తాయని విశ్వాసం ఉంది.
*రూపశ్రీ.



