త్రిగుణాల గురించి చక్కని ఉదాహరణ!

అందరూ అంటూ ఉంటారు. మనుషుల ప్రవర్తనను బట్టి సత్వగుణం, రజో గుణం, తమో గుణం అని. ఇలా మూడు గుణాలు మననుషులను ఎన్నో విధాలుగా ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఈ గుణాల గురించి లాజిక్ గా చెప్పుకుంటే తినే ఆహారపదార్థాలను బట్టి మనుషులలో హార్మోన్స్ ప్రభావితం అయ్యి మనుషుల ప్రవర్తనకు కారణం అవుతాయి. కానీ అందరూ ఏదో అధ్యాత్మికతలోనూ, పురణాల్లోనూ అది చెప్పారు, ఇది చెప్పారు వీళ్లకు ఏమి తెలుసు అన్నీ ఒట్టి మూఢనమ్మకాలు అని కొట్టిపడేస్తారు. భగవద్గీతలో కృష్ణుడు ఒక శ్లోకం చెబుతాడు. దానికి రామకృష్ణ పరమహంస వివరణ ఇలా ఉంటుంది. 

【శ్లోకం:- సత్త్వం సుభే సజ్జయతి రజః కర్మణి భారతః జ్ఞానమావృత్య తు తమః ప్రమాదే సంజయత్యుత॥

భావం:- సత్త్వగుణము సుఖమును ఇస్తుంది. రజోగుణము కర్మలు చేయడంలో ఆసక్తి కలుగజేస్తుంది. తమోగుణము మనలో ఉన్న జ్ఞానమును కప్పివేసి, నిర్లక్ష్యమును, సోమరితనమును కలుగజేస్తుంది.】

సత్వగుణము సుఖం కలుగజేస్తుంది.

రజోగుణము ఏదో ఒక పని చేయాలని కోరుకుంటుంది.

తమోగుణము ఏ పనీ చేయకుండా ఉండటానికి, ఒకవేళ చేసినా పొరపాటుగా చేయడానికి, తనలో ఉన్న జ్ఞానాన్ని కప్పిపెట్టి, అజ్ఞానంలో ప్రవర్తించడానికీ కోరుకుంటుంది. 

ఈ విషయంలో రామకృష్ణపరమహంసగారి వ్యాఖ్యలను చూస్తే. 

సత్వగుణం అంటే ఒక దీపం మీద స్వచ్ఛమైనగాజు చిమ్మీ పెట్టడం. అంటే తనలో ఉన్న జ్ఞానం అన్ని వైపులా ప్రసరింపచేయడం. దీపం వెలుగు అన్ని వైపులా ప్రసరించినప్పుడు దాని చుట్టూ ఉన్న పరిసరాలు అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. 

రజోగుణము అంటే ఒకదీపం మీద కంతలు ఉన్నగంప బోర్లించడం. అంటే తనలో ఉన్న జ్ఞానాన్ని కొద్ది కొద్దిగా బయటకు వేగంగా కర్మల రూపంలో ప్రసరింపచేయడం. కంతలు అంటే రంద్రాలు. వెదురు గంపకు అక్కడక్కడా చిన్నచిన్న రంద్రాలు ఉంటాయి. ఆ గంపను వెలుగుతున్న దీపం మీద బోరలిస్తే రంద్రాలలో నుండి వెలుగు బయటకు వస్తుంది. అది ఎలాగంటే మనిషి ఏదో ఒక పని చేస్తూ ఉండేలా మనిషిలో ఒక ప్రేరణ జరుగుతూ ఉంటుంది.

తమోగుణము అంటే ఒకదీపం మీద కుండ బోర్లిచడం అంటే తనలో ఉన్న జ్ఞానాన్ని పూర్తిగా కప్పిపెట్టి, అజ్ఞానంలో మునిగిపోవడం. చేయకూడని పనులు చేయడం. 

దీపం మీద కెజ్నడా బోరలిస్తే లోపల ఉన్న వెలుగు కనిపించదు. పిఆగ కుండ ఏమీ పారదర్శక పదార్థం కాదు. దాని నుండి వెలుగు బయటకు ప్రసారించదు. కాబట్టి మనిషి ఒక అంధకారంలో పడిపోతాడు. 

ఈ మూడు గుణములు బంధనములను కలిగించేవే. ఎందుకంటే ఈ మూడు గుణములు కలిగిన మానవుడు వాటికి దాసుడు అయిపోతాడు. వాటిలో మునిగి పోతాడు. తనను తాను బంధించుకుంటాడు. అవిలేకపోతే బతకలేను అనే స్థితికి వస్తాడు. కాబట్టి ఏదీ అతి పనికిరాదు. అంటీముట్టనట్టు ఉండాలి. తామరాకు మీద నీటి బొట్టులాగా ప్రవర్తించాలి. దేనికీ లొంగి పోకూడదు. ఏ గుణముతోనూ బంధింపబడ కూడదు.

ఇది భగవద్గీతలో కృష్ణుడు చెప్పేది అయినా రామకృష్ణ పరమహంస చక్కని ఉదాహరణలతో వివరించింది. 

                                   ◆వెంకటేష్ పువ్వాడ.


More Aacharalu