![]() |
![]() |
పలువురు సినీ ప్రముఖుల ఆరోగ్యం గురించి జరిగిన తప్పుడు ప్రచారం కారణంగా అభిమానులు, సన్నిహితులు ఆందోళన చెందిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవికి కూడా అలాంటి పరిస్థితి ఏర్పడింది. ఓ క్యాన్సర్ సెంటర్ ప్రారంభానికి వెళ్లిన చిరంజీవి అక్కడ మాట్లాడుతూ.. రెగ్యులర్ గా మెడికల్ టెస్టులు చేయించుకుంటే క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు అన్నారు. "నేను అలర్ట్ గా వుండి కొలోన్ స్కోప్ టెస్ట్ చేయించుకున్నాను. అందులో non - cancerous polyps ని డిటెక్ట్ చేసి తీసేశారు. అలా ముందుగా టెస్ట్ చేయించుకోకపోయివుంటే అది క్యాన్సర్ కింద మారేదేమో" అని చిరంజీవి చెప్పారు. అదే ఆయన మాటలను సరిగా అర్థం చేసుకోలేకపోయిన కొన్ని మీడియా సంస్థలు.. చిరంజీవి క్యాన్సర్ బారిన పడ్డారని రాసుకొచ్చాయి. ఆ వార్తలు చదివి అందరూ ఆందోళన చెందారు. దీంతో మీడియా తీరుపై అసహనం వ్యక్తం చేసిన చిరంజీవి ట్విట్టర్ వేదికగా తనదైన శైలిలో స్పందించారు.
"నేనొక క్యాన్సర్ సెంటర్ ని ప్రారంభించిన సందర్భంగా క్యాన్సర్ పట్ల అవగాహన పెరగాల్సిన అవసరం గురించి మాట్లాడాను. రెగ్యులర్ గా మెడికల్ టెస్టులు చేయించుకుంటే క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు అని చెప్పాను. నేను అలర్ట్ గా వుండి కొలోన్ స్కోప్ టెస్ట్ చేయించుకున్నాను. అందులో non-cancerous polyps ని డిటెక్ట్ చేసి తీసేశారు అని చెప్పాను. 'అలా ముందుగా టెస్ట్ చేయించుకోకపోయివుంటే అది క్యాన్సర్ కింద మారేదేమో' అని మాత్రమే అన్నాను. అందుకే అందరూ ముందు జాగ్రత్తలు తీసుకుని మెడికల్ టెస్టులు / స్క్రీనింగ్ చేయించుకోవాలి' అని మాత్రమే అన్నాను.
అయితే కొన్ని మీడియా సంస్థలు దీన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా, అవగాహనా రాహిత్యం తో 'నేను క్యాన్సర్ బారిన పడ్డాను' అని 'చికిత్స వల్ల బతికాను' అని స్క్రోలింగ్ లు, వెబ్ ఆర్టికల్స్ మొదలు పెట్టాయి. దీని వల్ల అనవసరమైన కన్ఫ్యూషన్ ఏర్పడింది. అనేకమంది వెల్ విషర్స్ నా ఆరోగ్యం గురించి మెసేజ్ లు పంపిస్తున్నారు. వారందరి కోసం ఈ క్లారిఫికేషన్. అలాగే అలాంటి జర్నలిస్టులకి ఓ విజ్ఞప్తి. విషయాన్ని అర్థం చేసుకోకుండా అవాకులు చవాకులు రాయకండి. దీనివల్ల అనేక మందిని భయభ్రాంతుల్ని చేసి బాధ పెట్టిన వారవుతారు." అని చిరంజీవి ట్వీట్ చేశారు.
![]() |
![]() |