తెలుగు భాషకు లుంగీతో పోలికా?  వైసీపీ ఎమ్మెల్యేకు తగునా?

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గర మంచి మార్కులు కొట్టేయాలనే తాపత్రయమో, సభలో సభ్యులను నవ్వించాలనే సరదా తెలియదు కాని.. ఓ వైసీపీ ఎమ్మెల్యే అసెంబ్లీలో వింత వాదన చేశారు. తన ప్రసంగంలో అనవసరమైన పోలీకలు తెచ్చారు. ఇందుకోసం తెలుగు భాషపైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు, సభలో వైసీపీ ఎమ్మెల్యే చేసిన ప్రసంగంపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వస్తున్నాయి. 

ఏపీ అసెంబ్లీలో చివరి రోజు ఇంగ్లీష్ భాషపై చర్చ జరిగింది. చర్చలో పాల్గొన్న  శ్రీకాళహస్తి వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి వింత ప్రసంగం చేశారు. ఇంగ్లిష్‌ మీడియం అవసరాన్ని గురించి మాట్లాడుతూ విచిత్రమైన పోలికలు తెచ్చారు. ఇంగ్లీషు రాకపోతే ఏ బాత్రూమ్‌లోకి వెళ్లాలో కూడా తెలియక ఇబ్బంది పడతామని  వ్యాఖ్యానించారు. అలాగే లుంగీలను తెలుగుతోనూ, ప్యాంట్లను ఇంగ్లి‌షుతోనూ ఆయన పోల్చారు. రోజంతా ప్యాంట్లు వేసుకున్నా రాత్రి లుంగీలు కట్టుకుంటామంటూ...రెండు భాషలూ అవసరమేనన్నారు. తెలుగు తల్లిలాంటిదని, ఇంగ్లిష్‌ భార్యలాంటిదని చెప్పారు. 

ఇంగ్లీష్ భాషపై ఎమ్మెల్యే బియ్యం మాట్లాడుతున్నంతసేపూ సభలో స్పీకర్‌ తమ్మినేని సహా అందరూ నవ్వుతూనే కనిపించారు. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ తమిళనాడులో పుట్టి ఇంగ్లిష్‌ నేర్చుకుని అమెరికా వెళ్లారని చెప్పారు. సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతూ...గ్రీకులో ఒక సామెత ఉందని దాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఆయన తెచ్చుకున్న పేపరు కనిపించలేదు.. ‘కావాలంటే గూగుల్‌లో కొట్టి చూడాల’ని సభ్యులకు సూచించారు మధుసూధన్ రెడ్డి. చివరకు ఆయన తెచ్చుకున్న సామెతలపేపరు దొరికింది. అందులో ఏముందో చదివి వినిపించాలని సహచర సభ్యులు కోరగా....‘అది గ్రీకులో ఉంది’ అని తన ప్రసంగాన్ని ముగించారు. 

జ‌గ‌న‌న్న‌కు మందుబాబుల బూస్టింగ్‌.. ప్ర‌భుత్వం ఫిదా..

ఇంగ్లీష్ భాషపై అసెంబ్లీలో బియ్యం మదుసూధన్ రెడ్డి చేసిన ప్రసంగం వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆయన ప్రసంగం సరదాగా ఉందని కొందరు కామెంట్లు చేస్తుంటే.. మరికొందరు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమ్మ భాషకు చెప్పుకునే తెలుగుకు వింత పోలీకలు తేవడంపై అభ్యంతరం చెబుతున్నారు. లుంగీతో తెలుగు భాషను పోల్చడమేంటనీ కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇంగ్లీష్ భాషపై ప్రేమ చూపడంలో తప్పు లేదు కాని.. అందుకోసం తెలుగు భాషను తక్కువ చేస్తూ మాట్లాడటం సరికాదని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. గత ఏడాది అసెంబ్లీ సమావేశాల్లోనూ ఇంగ్లీష్ భాషపై మాట్లాడిన బియ్యం మదుసూధన్ రెడ్డి.. అమెరికాలో ఆంగ్లం రాక తాను ఇబ్బంది పడ్డానంటూ కొన్ని ఘటనలు చెప్పి సభలో అందరిని నవ్వించారు.