జగనన్నకు మందుబాబుల బూస్టింగ్.. ప్రభుత్వం ఫిదా..
posted on Nov 27, 2021 11:09AM
ఏపీ ఖజానా వెలవెల. అప్పులు కూడా ముట్టని దుస్థితి. జీతాలు వేళకు ఇవ్వలేని పరిస్థితి. నవరత్నాల్లో ఒక్కో రత్నం రాలిపోతోంది. పథకాలకు భారీగా కోత పడుతోంది. ఇలా, దిక్కుతోచని స్థితిలో ఉన్న జగనన్నను.. మందుబాబులు మేమున్నామంటూ ఆదుకుంటున్నారు. ప్రభుత్వా ఖజానా నింపే బాధ్యత మాదంటూ తెగ తాగేస్తున్నారు. షాపులు తగ్గించినా.. పనివేళలు కుదించినా.. పర్మిట్ రూమ్లు రద్దు చేసినా.. బెల్టు షాపులు తీసేసినా.. ఊరూపేరు లేని పనికిమాలిన బ్రాండ్లు అమ్ముతున్నా.. మందుబాబులు మంచి మనసుతో జగన్ సర్కారును ఉద్దరిస్తున్నారు. ఉన్న షాపులతోనే అడ్జస్ట్ అవుతూ.. చేదు మందునే తాగేస్తూ.. కష్టనష్టాలకు తాము ఓరుస్తూ.. జగన్రెడ్డి ప్రభుత్వానికి మాత్రం ఓదార్పు ఇస్తున్నారు.
మద్యం విక్రయాలను తగ్గించడమే లక్ష్యమని ప్రభుత్వం చెబుతోంది. సర్కారు చెప్పేదాని ప్రకారం మద్యం అమ్మకాలతో పాటు ఆదాయమూ తగ్గాలి. అయితే ఆదాయం తగ్గకపోగా గతంలో కంటే ప్రతినెలా పెరుగుతూ పోతోంది. నెలకు రూ.1800 కోట్ల చొప్పున.. 6 నెలల్లోనే రూ.10,675 కోట్ల ఆదాయం ఖజానాకు చేరింది. కష్టాల్లో ఉన్న ప్రభుత్వానికి ప్రతినెలా దాదాపు రూ.1800 కోట్లు ఇచ్చే రంగం మరొకటి లేదు. మద్యం ఆదాయంతోనే ప్రభుత్వం మనుగడ సాగిస్తోందంటే నమ్మాల్సిందే.
వైసీపీ సర్కారు పైకి చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతన ఉండటం లేదు. షాపుల సంఖ్య భారీగా తగ్గించామంటూనే కొత్త బార్లకు, టూరిజం షాపులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. మద్యపాన నియంత్రణ అంటూనే.. అమ్మకాలు పెంచాలంటూ టార్గెట్లు పెడుతుంది. గతంలో ఎక్సైజ్ స్టేషన్లకు అమ్మకాలపై టార్గెట్లు పెట్టేవారు. ఇప్పుడు షాపుల సూపర్ వైజర్లపై ఒత్తిడి పెడుతున్నారు.
ఇక ప్రభుత్వ షాపుల్లో అమ్మకాలు పెంచడం కోసం ప్రభుత్వం పరోక్షంగా అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తీసుకురాకుండా కఠిన చర్యలు తీసుకుంటోంది. నాటుసారా తయారీపై వరుస దాడులు చేస్తోంది. ఇదంతా అక్రమాల నివారణ కోసం అన్నట్టుగా కనిపించినా.. షాపుల్లో మద్యం అమ్మకాలు పెంచడం కోసమేనని అంటున్నారు. ఇలా మందుబాబులతో ప్రభుత్వ మద్యం షాపుల్లో పూటుగా తాగించి.. నిండుగా ఖజానా నింపుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం దూసుకుపోతోంది. అందుకు, మద్యంప్రియులు కూడా జగనన్నకు బాగా సహకరిస్తున్నారు.