తూర్పు గోదావరి జిల్లాలో రూ 2.40 కోట్ల నగదు సీజ్ 

తూర్పు గోదావరి జిల్లాలో ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులో తరలిస్తున్న రూ.2.40 కోట్ల నగదును పోలీసులు సీజ్‌ చేశారు. ఈరోజు ఉదయం గోపాలపురం మండలం జగన్నాథపురం గ్రామ శివారులోని అంతర్‌ జిల్లాల చెక్‌పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నానికి వెళుతున్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులో రూ.2.40 కోట్ల నగదు తరలి వెళుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ మొత్తానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో సీజ్‌ చేసినట్లు దేవరపల్లి సర్కిల్‌ సీఐ బాలసురేష్‌బాబు తెలిపారు. హైదరాబాద్ నుంచి విశాఖ పట్నం వెళుతున్న వీరాంజనేయ అనే ట్రావెల్ బస్సులో డబ్బు దొరికింది. దీనికి సంబంధించి ప్రస్తుతానికి ఎటువంటి ఆధారాలు దొరకలేదు. ఇది హవాలా డబ్బా..లేక ఎన్నికల కోసం తరలిస్తున్నారా అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎవరు తీసుకెళుతున్నారు, ఎవరి కోసం తీసుకెళుతున్నారు అనే అంశాలు కూడా ఇంకా తెలియలేదు. డబ్బును తీసుకెళ్ళుతున్న వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారిస్తున్నారు. వీరి దగ్గర పోలీసులకు ఎలాంటి అనుమతి పత్రాలు లభించలేదు. ఎన్నికల నేపథ్యంలో గ్రామాలు, సరిహద్దుల్లో పోలీసులు ఎక్కడి క్కడ చెక్ పోస్ట్‌లను ఏర్పాటు చేశారు. ఇలాంటి అధిక మొత్తంలో ఎవరు డబ్బులు పట్టుకెళ్ళినా వారిని పట్టుకుంటూ చర్యలు తీసుకుంటున్నారు.