సత్యసాయి ట్రస్టు భవిష్యత్తు ఏమిటి?

హైదరాబాద్‌: పుట్టపర్తి సత్య సాయిబాబా వారసుడిని ఇప్పటికిప్పుడు ప్రకటించే అవకాశాలు లేవు. పుట్టపర్తి ట్రస్టు వ్యవహారాల్లో తాము జోక్యం చేసుకోబోమని, ట్రస్టు పనులు కొనసాగుతాయని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. అయినప్పటికీ శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్టు భవిష్యత్తు ఒక రకంగా అయోమయంగానే ఉంది. ట్రస్టు విలువ 40 వేల కోట్ల నుంచి లక్ష కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా. ఆకాశ రామన్న ఉత్తరాలతో ట్రస్టు సభ్యుల్లో విభేదాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సెంట్రల్ ట్రస్టు చైర్మన్‌గా సత్య సాయిబాబా కొనసాగుతూ వచ్చారు. చెక్‌పై సంతకం చేసే అధికారం కూడా ఆయనకు ఒక్కరికే ఉండేది. ఈ వివాదాన్ని ట్రస్టు సభ్యులు ఎలా పరిష్కరించుకుంటారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. మిగతా బాబాల మాదిరిగా కాకుండా సత్య సాయిబాబా తన కుటుంబ సభ్యులతో సన్నిహిత సంబంధాలు నెరుపుతూ వచ్చారు. ట్రస్టు సభ్యుడైన సత్య సాయిబాబా సోదరుడు జానకీ రామయ్య కుమారుడు రత్నాకర్ తనకు పెద్ద పాత్ర కావాలని డిమాండ్ చేస్తున్నారు. జానకీరామయ్య మృతితో రత్నాకర్ ట్రస్టు సభ్యుడయ్యారు. కార్యదర్శి కె. చక్రవర్తి వంటి ట్రస్టు నిర్వాహకులు సంస్థ ప్రొఫెషనల్స్ చేతుల మీదుగా నడవాలని అభిప్రాయపడుతున్నారు. చక్రవర్తి సత్య సాయిబాబాకు సేవలు అందించడానికి ఐఎఎస్ పదవికి స్వస్తి చెప్పారు. మాజీ ప్రధాన న్యాయమూర్తి పిఎన్ భగవతి, మాజీ సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ఎస్‌వి గిరి చక్రవర్తి అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారు. పోలీసులకు గత కొద్ది రోజులుగా ఆకాశ రామన్న ఉత్తరాలు వస్తున్నాయి. కరపత్రాల పంపిణీ జరిగింది. దీంతో ట్రస్టు సభ్యుల్లో విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది. సెంట్రల్ ట్రస్టు డీడ్ ప్రకారం ఏ మార్పులైనా వ్యవస్థాపక ట్రస్టీ ఆమోదంతోనే జరగాల్సి ఉంటుంది. వ్యవస్థాపక ట్రస్టీ లేకపోవడంతో ట్రస్టు భవిష్యత్తు ఏమిటనేది తెలియడం లేదు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu