చంద్రబాబు మనసులో ఏమీ లేదు
posted on Jul 18, 2018 10:55AM
రమణ దీక్షితులు స్వామి వారి ఆభరణాలు మిస్ అయ్యాయంటూ టీటీడీ మీద, టీడీపీ ప్రభుత్వం మీద ఆరోపణలు విమర్శలు చేసిన విషయం తెలిసిందే.. అయితే తాజాగా రమణ దీక్షితులు ఆయన గతంలో చేసిన ఆరోపణల గురించి, చంద్రబాబు గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు.. తాను గతంలో చేసిన ఆరోపణలపై భక్తుల నుంచి స్పందన కరువైందని, కొండమీదున్న సాటి అర్చకుల మద్దతుకూడా లభించలేదని అన్నారు.. తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని, సీబీఐ విచారణ జరపాలని.. ఈ విషయంలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని పేర్కొన్నారు.
అదే విధంగా 'సీఎంను కలిసేందుకు గతంలో చాలాసార్లు ప్రయత్నించానని.. అపాయింట్మెంట్ ఇచ్చి కూడా వెనక్కి తిప్పిపంపారని ఆరోపించారు.. ఇప్పుడిచ్చినా కలుస్తా.. సీఎం చంద్రబాబు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు.. ఎస్వీ యూనివర్సిటీలో నా జూనియర్.. నాకు బాగా పరిచయమైన వ్యక్తి.. కొంతమంది ప్రోద్బలంతో ఆయన నాకు వ్యతిరేకంగా ఉన్నారు.. ఆయన మనసులో మాత్రం ఏమీ లేదు.. మేమంతా స్వామివారి భక్తులమే.. నేను అర్చకుణ్ని కాబట్టి కొండపై అంతా బాగుండాలని కోరుకుంటా. ఆయన రాష్ట్రమంతా బాగుండాలని కోరుకోవాలి అని రమణ దీక్షితులు తెలిపారు.