ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధా కిషన్ రావు అరెస్ట్
posted on Jul 4, 2024 4:48PM
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు రాధాకిషన్ రావును పోలీసులు అదుపులోకీ తీసుకున్నారు. చంచల్గూడ జైల్లో ఉన్న ఆయనను పీటీ వారెంట్పై అదుపులోకి తీసుకుని, నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుకు సంబంధించి రాధాకిషన్ రావును అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఓ ల్యాండ్ వ్యవహారంలో వ్యాపారవేత్తను బెదిరించినందుకు ఆయనపై జుబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఓ కంపెనీ వ్యవహారంలో రాధాకిషన్ రావు జోక్యం చేసుకొని సెటిల్మెంట్ చేశారని ఆరోపణలు ఉన్నాయి. రూ.150 కోట్ల విలువైన కంపెనీని తక్కువ ధరకు మరొకరికి ఇప్పించినట్లుగా ఫిర్యాదులో పేర్కొన్నారు.రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టై, ప్రస్తుతం చంచల్గూడ జైలులో ఉన్న మాజీ డీసీపీ రాధాకిషన్ రావును మరో కేసులో జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పీఎస్లో నమోదైన ఓ కేసులో పీటీ వారెంట్పై ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు.
చెన్నుపాటి వేణుమాధవ్ అనే వ్యక్తి గతంలో రాధాకిషన్రావుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాధాకిషన్ తనను కిడ్నాప్ చేసి షేర్లు బదలాయించుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. క్రియా హెల్త్కేర్ షేర్లను బలవంతంగా బదిలీ చేయించుకున్నారని ఆయన ఆరోపించారు. వేణుమాధవ్ ఫిర్యాదుతో రాధాకిషన్ రావును పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఈయనతో పాటు మరో ఇద్దరు టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్లపైనా కేసు నమోదు చేశారు.