అమరావతిలో క్వాంటం వ్యాలీ.. వచ్చే ఏడాది జనవరికల్లా రెడీ
posted on May 2, 2025 3:52PM

క్వాంటం కంప్యూటింగ్లో ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే ముందువరుసలో నిలపాలని పట్టుదలతో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వచ్చే ఉడాది జనవరి 1న అమరావతి కేంద్రంగా క్వాంటం కంప్యూటింగ్ కార్యకలాపాలు ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఉండవల్లిలోని సీఎం చం్రబాబు నివాసంలో ఐబీఎం, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), లార్సన్ & టూబ్రో (L&T) సంస్థలతో ప్రభుత్వం శుక్రవారం ( మే2)) ఎంవోయూ కుదుర్చుకుంది. దీంతో అమరావతిలో భారతదేశపు మొట్టమొదటి, అత్యాధునిక క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్ నిర్మాణం కానుంది. దేశంలోనే తొలిసారి ఐబీఎం అతిపెద్ద క్వాంటమ్ కంప్యూటర్ 156 క్యూబిట్ హెరాన్ ప్రాసెసర్ కలిగిన ‘క్వాంటం సిస్టం 2’ని అమరావతిలో నెలకొల్పనుంది.
ఎంవోయూ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. 1990లలో దేశంలో ఐటీ విప్లవానికి ఆంధ్రప్రదేశ్ కీలకంగా నిలిచిందని, ఇప్పుడు దేశంలో క్వాంటమ్ విప్లవానికి కూడా ఏపీయే నాయకత్వం వహిస్తుందని అన్నారు. ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీతో జరిగిన ఒప్పందంతో ఈ రోజు ఆంధ్రప్రదేశ్కే కాదు, భారతదేశానికి కూడా చారిత్రాత్మక దినంగా మారిందని చంద్రబాబు అన్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్ భవిష్యత్ పాలనకు, ఆవిష్కరణలకు పునాది అవుతుందనీ, సాంకేతికరంగంలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి కొత్త అవకాశాలు వస్తున్నాయనీ, వాటిని అందిపుచ్చుకుని ముందుకు సాగడం ముఖ్యమన్నారు.
భవిష్యత్ అవసరాలన్నీ క్వాంటం కంప్యూటింగ్పైనే ఆధారపడి ఉంటాయని అందుకే అమరావతిని క్వాంటం వ్యాలీ చేయాలనుకున్నట్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చెప్పారు. సిలికాన్ వ్యాలీ తరహాలో క్వాంటం వ్యాలీగా అమరావతిని తీర్చిదిద్దాలని ఐబీఎం, టీసీఎస్ సంస్థల ప్రతినిధులకు ముఖ్యమంత్రి సూచించారు. హైటెక్ సిటీని 15 నెలల్లో నిర్మించిన అనుభవాన్ని గుర్తుచేస్తూ, క్వాంటమ్ వ్యాలీ తక్కువ సమయంలోనే నిర్మించవచ్చన్నారు. ఇప్పటికే ఎల్&టీకి స్థలాన్ని కేటాయించామన్న చంద్రబాబు, మౌలిక వసతులను అత్యంత వేగంగా అభివృద్ధి చేస్తామన్నారు. ఇందుకోసం రెండు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఒక కమిటీ నిర్మాణ పురోగతిపైనా, మరొక టి వ్యవస్థ అభివృద్ధిపైనా దృష్టి సారిస్తాయన్నారు. భారతదేశంలో ఐబీఎం క్వాంటం సిస్టం 2 స్థాపన, దేశ క్వాంటం ప్రయాణానికి కీలక మలుపు కానుందన్నారు.