అరుణ్ జైట్లీ పరిస్థితి మరింత విషమం.. ఎయిమ్స్కు రాష్ట్రపతి
posted on Aug 16, 2019 12:41PM
కేంద్ర మాజీ ఆర్ధికమంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారినట్టు తెలుస్తోంది. కొద్దికాలం నుంచి అనారోగ్యంగా ఉన్న ఆయన గత వారం రోజులుగా ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం జైట్లీ ఆరోగ్యం మరింత క్షీణించినట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో.. ఇవాళ ఆయనను పరామర్శించేందుకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఎయిమ్స్కు వెళ్లనున్నారు.
66 ఏళ్ల అరుణ్ జైట్లీ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అందుకే ఆయన 2019సార్వత్రిక ఎన్నికలకు కూడా దూరంగా ఉన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో చికిత్స కోసం జైట్లీ అమెరికా వెళ్లడంతో.. ఆయన బదులు పియూష్ గోయల్ మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టాల్సి వచ్చింది. మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటికీ.. మంత్రివర్గంలో చేరలేదు. తాను ఎలాంటి పదవులూ స్వీకరించలేనంటూ జైట్లీ ప్రధానికి లేఖ రాశారు.