కేజ్రీవాల్ కు దక్కని బెయిలు

మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు ఊరట లభించలేదు. కోర్టు ఆయనకు మరోసారి రిమాండ్ పొడిగించింది. మద్యం కుంభకోణం కేసులో అరెస్టై ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ కు బుధవారం (సెప్టెంబర్ 11)తో జ్యుడీషియల్ గడువు ముగియడంతో ఆయనను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్పెషల్ జడ్జి జస్టిస్ కావేరీ బవేజా ముందు ప్రవేశపెట్టారు. న్యాయమూర్తి కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని సెప్టెంబర్ 25 వరకూ పొడిగించారు. 

ఇలా ఉండగా తన  అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీం కోర్టు తీర్పు రిజర్వ చేసింది. కేజ్రీవాల్ పిటిషన్ పై ఈ నెల 5 సుప్రీం కోర్టు విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్వల్ భుయాన్ తో కూడిన ధర్మాసనం ముందు కేజ్రీ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి, ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలూ విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ చేసింది. ఇదే మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇప్పటికే బెయిలుపై విడుదలయ్యారు.