ఒకే ఎన్ క్లోజర్ లో ఈ సింహాలు  వద్దు: కలకత్తా హైకోర్టు 

మతపరమైన అంశాల్లో కోర్టులు కొన్ని సందర్భాల్లో జోక్యం చేసుకోవచ్చని సుప్రీంకోర్టు గతంలోనే  స్పష్టం చేసింది. పశ్చిమ బెంగాల్ లోని సిలిగురి సఫారీ పార్క్ లో అక్బర్, సీత అనే సింహాలను ఒకే ఎన్ క్లోజర్ లో ఉంచడం పట్ల విశ్వ హిందూ పరిషత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం తెలిసిందే. ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీసే చర్య అంటూ కలకత్తా హైకోర్టును విహెచ్ పి  ఆశ్రయించింది. 

పశ్చిమ బెంగాల్ అటవీశాఖ అధికారులే ఆ సింహాలకు పేర్లు పెట్టారని ఆరోపించింది. వీహెచ్ పీ పిటిషన్ పై విచారణ చేపట్టిన కలకత్తా హైకోర్టు ఆ రెండు సింహాలకు పేర్లు మార్చాలని ఆదేశించింది. తద్వారా ఈ వివాదానికి తెరదించాలని జస్టిస్ సౌగతా భట్టాచార్య స్పష్టం చేశారు.

ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ వాదనలు వినిపించారు. ఆ సింహాలను త్రిపుర నుంచి తీసుకువచ్చారని, వాటికి త్రిపురలోనే పేర్లు పెట్టారని వివరించారు. పేర్లను మార్చే అంశాన్ని ప్రభుత్వం ఇప్పటికే పరిశీలిస్తోందని వెల్లడించారు. 

కాగా, పశ్చిమ బెంగాల్ అధికారులు ఈ రెండు సింహాలను త్రిపురలోని సిపాహీజాలా జూలాజికల్ పార్క్ నుంచి తీసుకువచ్చారు. ఇందులో అక్బర్ మగ సింహం కాగా, సీత ఆడసింహం.

అధికారురులు పేర్లు పెట్టినప్పుడు మతం చూడలేదు. వీటిని ఒకే ఎన్ క్లోజర్ లో బంధించినప్పుడు మాత్రమే వివాదమయ్యింది.  రామాయణంలో సీత పాత్ర పరమ పవిత్రం. అక్బర్ మన దేశంపై దండయాత్ర జరిపిన మొఘల్ సామ్రాజ్య చక్రవర్తి.  త్రేతాయుగంలో జన్మించిన రాముడి భార్య సీత పేరు పెడితే  అధికారుల తప్పేం లేదు. కానీ  అక్బర్  అనే సింహం ఎన్ క్లోజర్ లో సీత అనే మరో సింహాన్ని బంధించడం హిందువుల మనో భావాలు దెబ్బతిన్నాయి. కాబట్టే కలకత్తా హైకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.