జగన్ గారి చెత్త పాలన గురించి వైసీపీ నేతల వ్యాఖ్యలు.. వారిని కూడా సీఐడీ అరెస్ట్ చేస్తుందా?

ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిలపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ విశాఖలో టీడీపీ సానుభూతిపరుడు నలంద కిషోర్‌ను సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మూడు రోజుల క్రితమే ఆయనకు నోటీసులు ఇచ్చిన పోలీసులు ఈ తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు కిషోర్‌ సన్నిహితుడని తెలుస్తోంది. అలాగే కృష్ణాజిల్లా నందిగామలో టీడీపీకి చెందిన చిరుమామిళ్ల కృష్ణను కూడా అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్ పెట్టారంటూ అర్థరాత్రి సమయంలో అతడ్ని సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

కిషోర్‌, కృష్ణ అరెస్ట్ లపై నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. నందమూరి బాలకృష్ణ నటించిన 'సింహా' సినిమాలోని 'నో పోలీస్' డైలాగును అనుకరిస్తూ ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

"వైకాపా మాఫియా ఇసుక కొట్టేస్తే నో సిఐడి, ఇళ్ల స్థలాలు అమ్మతుంటే నో సిఐడి, ఇళ్ల స్థలాల కొనుగోలు పేరుతో కోట్లు కొల్లగొడుతుంటే నో సిఐడి, విషం కంటే ప్రమాదకరమైన మందు పోస్తూ వేల కోట్లు జే ట్యాక్స్ వసూలు చేస్తుంటే నో సిఐడి.108 లో స్కామ్ బయటపడితే నో సిఐడి, మైన్స్ మింగేస్తుంటే నో సిఐడి. మహిళల పై అత్యాచారాలు,వేధింపులకు పాల్పడుతుంటే నో సిఐడి. రాజారెడ్డి రాజ్యాంగంలో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ని సోషల్ మీడియా వేధింపుల డిపార్ట్మెంట్ గా మార్చేసారు వైఎస్ జగన్ గారు. భావ ప్రకటనా స్వేచ్ఛ ని హరించే హక్కు మీకు ఎవరిచ్చారు?" అని లోకేష్ ఫైర్ అయ్యారు.

"ఏం నేరం చేసారని అర్థరాత్రి చొరబడి మా కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారు? కృష్ణ,కిషోర్ గారికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుంది. జగన్ గారి చెత్త పాలన గురించి వైకాపా ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలే మీడియా ముఖంగా వివరిస్తున్నారు మరి వారిని కూడా సిఐడి అరెస్ట్ చేస్తుందా?" అని లోకేష్ ప్రశ్నించారు.