లేనిపోని రచ్చ చేయకండి.. బాలయ్య మాస్ వార్నింగ్!
posted on Sep 12, 2024 5:49PM
ఇటీవల భారీ వర్షాలు, వరదలు కారణంగా ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాలు ముంపునకు గురైన సంగతి తెలిసిందే. అయితే ఈ కష్ట కాలంలో రాజకీయాలకతీతంగా ప్రజలకు అండగా నిలవాల్సింది పోయి.. విపక్ష నేత వైఎస్ జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేసిన సంగతి తెలిసందే. ఇవి కృత్రిమ వరదలని, ప్రభుత్వమే వరదలకు కారణమంటూ అర్థంపర్థంలేని ఆరోపణలు చేశారు. ఇప్పటికే జగన్ ని పలువురు తప్పుబట్టారు. తాజాగా ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సైతం జగన్ తీరుపై మండిపడ్డారు. (Nandamuri Balakrishna)
వరద బాధితుల సహాయార్థం సీఎం రిలీఫ్ ఫండ్ కి ప్రకటించిన విరాళాన్ని అందించడానికి.. యువ హీరోలు సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ తో కలిసి వెళ్లిన బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ జగన్ తీరుని తప్పుబట్టారు. ప్రభుత్వమే వరదలు సృష్టించిందని అనడం హాస్యాస్పదం అన్నారు. దీనిపై లేనిపోని రచ్చ చేయడం సబబు కాదని, అసలు వాళ్ల పేర్లు ఎత్తడం కూడా అనవసరం అంటూ బాలకృష్ణ ఘాటుగా స్పందించారు. అలాగే ఈ కష్ట సమయంలో ప్రజలకు సహాయం చేయడానికి ముందుకు వచ్చిన వారందరికీ పేరుపేరునా కృతఙ్ఞతలు తెలిపారు బాలకృష్ణ.