మియాపూర్‌ రోడ్డుపై 14 అడుగుల లోతులో భారీ గుంత!

హైదరాబాద్ లోని మియాపూర్-ప్రశాంత్‌నగర్ ప్రధాన రహదారి మధ్యలో అకస్మాత్తుగా భారీ గుంత ఏర్పడింది. వాహనదారుల అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. ఈ గుంత పది అడుగుల వెడల్పు, 14 అడుగుల లోతు ఉంది. ఈ రోడ్డు సమీపంలోనే ఓ ప్రైవేట్‌ కార్పొరేట్‌ స్కూల్‌ ఉంది. ఈ రోడ్డు పై నుంచి 25 కాలనీలకు వాహన దారులు రాకపోకలు సాగిస్తుంటారు. రోడ్డు ఒక్కసారిగా కుప్పకూలిపోయి పెద్దలోయ లాగా ఏర్పడటంతో వాహనదారులను భయభ్రాంతులకు గురయ్యారు.

సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్న అధికారులు ఆ రోడ్డును బ్లాక్ చేసి ప్రమాదపు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. రోడ్డు ఒక్కసారిగా కూలడానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. గతంలో ఇక్కడ భారీ పైపులైను నిర్మాణం జరిగిందని, ఆ ప్రభావంతోనే ఇప్పుడు రోడ్డు కుంగి గుంత ఏర్పడిందని అభిప్రాయపడ్డారు. కాగా, ఈ గుంతకు సమీపంలోనే మరో చోట కూడా రోడ్డు కుప్పకూలడానికి సిద్ధంగా ఉన్నట్లు గుర్తించిన అధికారులు అక్కడ కూడా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. గుంత ఏర్పడిన ప్రాంతంలో మరమ్మతులు చేపట్టారు.