కత్తిపోట్లతో ప్రేయసి... తాళి కట్టిన ప్రియుడు

 

కత్తిపోట్లుతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ ప్రియురాలు మెడలో తాళి కట్టి తన భార్యను చేసుకున్నాడు ఓ ప్రియుడు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. కలెసైల్వి అనే యువతి తమిళనాడులోని తిరువారూరు జిల్లా వవుసినగర్ లో ఉంటుంది. అదే ప్రాంతానికి చెందిన ఇళయరాజా, ఆమె ప్రేమించుకుంటున్నారు. అయితే వీరిద్దరి ప్రేమను ఇంట్లో వ్యతిరేకించడంతో ఆమె ఇళయరాజా దగ్గరే ఉంటుంది. కాగా వీరిద్దరు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వివాహానికి కావలసిన తాళి, ఇతర వస్తువులు కొనుగోలు చేసేందుకు ఇళయరాజా వెళ్లాడు. ఈ నేపథ్యంలో కలెసైల్వికుటుంబసభ్యులు, చిన్నాన్నలు అక్కడికి వెళ్లి ఆమెను ఇంటికి వచ్చేయాలని బలవంతం చేయగా ఆమె నిరాకరించింది. దీంతో ఆగ్రహించిన వారు ఆమెపై కత్తితో దాడిచేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని తీవ్ర గాయాలపాలైన కలెసైల్విని తంజావూరు వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. ఒక వైపు కలెసైల్వి చికిత్స పొందుతున్నా మళ్లీ ఎక్కడ వచ్చి దాడి చేస్తారో... లేదా తమను విడదీస్తారేమోనని భయంతో ఇళయరాజా ఆమె మెడలో తాళికట్టాడు.