కొండా సురేఖ మీద ఇంకో పరువు నష్టం కేసు!

పరిధులు మించి మాట్లాడి పరువు పోగొట్టుకున్న తెలంగాణ మంత్రి కొండా సురేఖ ఇప్పటికే అక్కినేని నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం కేసును ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమె మరో పరువు నష్టం కేసు ఎదుర్కోవలసి వస్తోంది. ఆ కేసు వేసింది మరెవరో కాదు... టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. గురువారం నాడు నాంపల్లి ప్రత్యేక కోర్టులో కేటీఆర్ తరఫు న్యాయవాది ఉమామహేశ్వరరావు కొండా సురేఖ మీద పరువు నష్టం కేసు దాఖలు చేశారు. బీఆర్ఎస్ నాయకులు బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, తుల ఉమ, దాసోజు శ్రవణ్‌లను సాక్షులుగా పేర్కొన్నారు. ఇదిలా వుంటే కొండా సురేఖ మీద అక్కినేని నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం కేసును నాంపల్లి కోర్టు గురువారం నాడు విచారణకు స్వీకరించింది. ఈ కేసు విషయంలో కొండా సురేఖకు కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణను అక్టోబర్ 23వ తేదీకి వాయిదా వేసింది.