రతన్‌ టాటాకి నివాళి.. ముంబైకి బాబు, లోకేష్!

పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటాకి ఆంధ్రప్రదేశ్ కేబినెట్ నివాళులు అర్పించింది. ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు మంత్రివర్గ సహచరులు రతన్ టాటా చిత్రపటానికి నివాళులు అర్పించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సందర్భంగా రతన్ టాటా దేశానికి చేసిన సేవలను ప్రస్తావించారు. రతన్ టాటా విలువలతో కూడిన వ్యాపారం చేసి, ఒక కొత్త ట్రెండ్‌ని సృష్టించారని చంద్రబాబు కొనియాడారు. సంపదను సృష్టించడం మాత్రమే కాకుండా, సృష్టించిన సంపదను సమాజంలో అన్నివర్గాలకు చేరడానికి రతన్ టాటా కృషి చేశారని అన్నారు. రతన్ టాటా మరణం దేశ పారిశ్రామిక రంగానికి మాత్రమే కాకుండా, దేశానికే తీరని లోటు అని ఆయన అభిప్రాయపడ్డారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్... రతన్ టాటాకి నివాళులు అర్పించడానికి ముంబై బయల్దేరి వెళ్ళారు.