శ్రీశారదా పీఠానికి 15 ఎకరాలు.. ఏపీ కేబినెట్ పచ్చజెండా.. 

అమరావతిలో సీఎం అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు, రైతులకు 9 గంటల పగటిపూట ఉచిత విద్యుత్ అందించేందుకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఒప్పందానికి కేబినెట్ ఆమోదం లభించింది. యూనిట్ కు రూ.2.49 చొప్పున ఏడాదికి 17వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనుగోలు ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది మంత్రివర్గం. సినిమాటోగ్రఫీ చట్టసవరణ ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ పడింది.

2021 జనాభా గణనలో బీసీ జనాభాను కులాల వారీగా గణించాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసే ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు, అగ్రవర్ణాల సంక్షేమం కోసం ప్రత్యేక శాఖ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం లభించింది. కొత్తగా జైన్ కార్పొరేషన్, సిక్కు కార్పొరేషన్ ఏర్పాటుకు కేబినెట్ ఓకే చెప్పింది. వైద్య, ఆరోగ్యశాఖలో భారీగా ఉద్యోగాల భర్తీకి పచ్చజెండా ఊపింది. రాష్ట్రంలో 5 చోట్ల సెవన్ స్టార్ పర్యాటన రిసార్ట్ ల ఏర్పాటు కోసం భూముల కేటాయింపునకు తీర్మానం చేసింది.

పీపీపీ విధానంలో శిల్పారామం అభివృద్ధికి జగన్ కేబినెట్ ఆమోదముద్ర వేసింది. విశాఖలో తాజ్‍వరుణ్ బీచ్ ప్రాజెక్ట్ కు ఆమోదం తెలిపిన కేబినెట్.. జయలక్ష్మీ నరసింహ శాస్త్రి గుండ్లూరు ట్రస్టుకు అనంతపురం జిల్లా బొమ్మేపర్తిలో 17.49 ఎకరాల కేటాయింపునకు ఆమోదముద్ర వేసింది. శ్రీశారదా పీఠానికి కొత్తవలసలో 15 ఎకరాల కేటాయింపునకు కేబినెట్ ఆమోదం లభించింది. ఇక వచ్చేనెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని జగన్ మంత్రివర్గం నిర్ణయించింది.