జగన్మోహనపురం.. బోర్డు పీకేశారు!
posted on Jun 26, 2024 12:45PM
తన ఐదేళ్ళ ఏలుబడిలో జగన్ అండ్ గ్యాంగ్ చేసిన కామెడీలు ఒక్కొక్కటి బయటకి వస్తున్నాయి. ఆల్రెడీ రైతుల పట్టాదారు పాస్ పుస్తకాల మీద తన పేరు వేసుకోవడం, భూముల సర్వే చేసి, సరిహద్దు రాళ్ళమీద జగన్ బొమ్మ ముద్రించడం లాంటి సిల్లీ పనులు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఏకంగా ఒక ఊరుకే తన పేరు పెట్టుకున్నారు. కాకినాడకు సమీపంలోని పోలవరం అనే గ్రామానికి వెళ్ళే దారిలో వైసీపీ మూకలు గతంలో ఒక భారీ ఆర్చీ కట్టి, దాని మీద ‘వైఎస్ జగన్మోహనపురం’ అనే అక్షరాలను ఏర్పాటు చేశారు. రెండు వైపులా జగన్ ఫొటోలు కూడా పెట్టారు. తమ్మవరం పంచాయితీలోని పోలవరం గ్రామానికి వెళ్ళే మార్గంలో నేమాం లేఔట్ పేరుతో జగనన్న కాలనీ ఏర్పాటు చేశారు. ఆ కాలనీకి ‘వైఎస్ జగన్మోహనపురం’ అని పేరు పెట్టుకోవాలని వైసీపీ మూకలు భావించాయి. అయితే ఆ కాలనీ ముందు కాకుండా, పోలవరానికి వెళ్ళే ప్రధాన రహదారి మీదే పెద్ద ఆర్చీ కట్టేసి, పేరు పెట్టేశాయి. పోలవరం గ్రామ ప్రజలు దీనికి అభ్యంతరం చెబితే, వైసీపీ మూకలు బెదిరింపులకు దిగి అదుపు చేశాయి. ఇప్పుడు రాక్షస పాలన పోవడంతో పోలవరం గ్రామ యువకులు రంగంలోకి దిగారు. ఆర్చీ ఎక్కేసి వైఎస్ జగన్మోహనపురం అనే అక్షరాలను పీకేశారు. ఆర్చీ మీద జనసేన జెండా ఎగరేశారు. ఇదంతా చూసిన వైసీపీ వర్గాలు కుక్కినపేనుల్లా పడివున్నాయి తప్ప కిక్కురమనలేదు!