వ్యక్తిగత అభివృద్దిని దెబ్బతీసే వినికిడి సమస్యకు చెక్ పెట్టాలి..!


సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు పెద్దలు.  ఇంద్రియాలలోకి కళ్లు ప్రధానం. కానీ ఇంద్రియాలలో ఏ ఒక్కటి సరిగా పని చేయకపోయినా ఇబ్బంది పడవలసిందే. ముఖ్యంగా ఇతరులు చెప్పేది వినడంలో,  చెప్పిన దాన్ని అర్థం చేసుకోవడంలో చెవులు కీలకపాత్ర పోషిస్తాయి.  కానీ వినికిడి లోపిస్తే  మాత్రం వ్యక్తుల జీవితాలలో చాలా ఇబ్బందులు ఎఎదుర్కోవాల్సి వస్తుంది.  ఈ వినికిడి సమస్య గురించి,  వినికిడి సమస్యతో ఇబ్బంది పడుతున్న వ్యక్తుల గురించి అవగాహన పెంచడానికి   ప్రతి సంవత్సరం మార్చి 3న, ప్రపంచవ్యాప్తంగా చెవి సమస్యలు,  వినికిడి లోపాన్ని నివారించడం గురించి అవగాహన పెంచడానికి  ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దీని గురించి తెలుసుకుంటే..

ప్రతి సంవత్సరం వినికిడి సమస్యల శాతం ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతూ వస్తోంది. దీని గురించి చర్యలు తీసుకోవడానికి ఈ ఏడాది థీమ్ ను అరెంజ్ చేశారు.  "మారుతున్న మనస్తత్వాలు: అందరికీ చెవి,  వినికిడి సంరక్షణను వాస్తవికతగా మార్చడానికి మిమ్మల్ని మీరు శక్తివంతం చేసుకోండి" అనే థీమ్‌తో ఈ ఏడాది చర్యలు సాగుతాయి.


వినికిడి లోపం అనేది రోజురోజుకు  పెరుగుతున్న ప్రజారోగ్య సమస్య.  ప్రపంచవ్యాప్తంగా 1.5 బిలియన్లకు పైగా ప్రజలు దీని బారిన పడ్డారు. దాదాపు 80% మంది తక్కువ,  మధ్య-ఆదాయ దేశాలలో నివసిస్తున్నారు.  ఆగ్నేయాసియా ప్రాంతంలోనే 400 మిలియన్ల మంది ప్రజలు వినికిడి సమస్యలను ఎదుర్కొంటున్నారని అంచనా. ఇవి ఇలాగే కొనసాగితే 2050 నాటికి ఈ సంఖ్య 660 మిలియన్లకు పెరగవచ్చని అంటున్నారు.

పైన చెప్పినవి  కేవలం గణాంకాలు మాత్రమే కాదు. జీవితాలు, జీవనోపాధి,  వ్యక్తుల అభివృద్దిని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నందుకు అవి సాక్ష్యాలు అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.  ఇలాంటి  వ్యక్తుల జీవితాల గురించి ఈ సంఖ్య స్పష్టం చేస్తుంది. పరిష్కరించబడని వినికిడి లోపం చాలా తీవ్రమైన పరిణామాలను కలిగి ఉంటుంది .  మాట్లాడటానికి, చదువుకోవడానికి, ఉపాధి,  మానసిక ఆరోగ్యాన్ని.. ఇలా చాలా విషయాలు  ప్రభావితం చేస్తుంది. అయితే చాలా వరకు చెవి సమస్యలు  సమర్థవంతమైన, ఖర్చుతో కూడుకున్న చికిత్సల ద్వారా నయం చేయవచ్చు.  అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా 80% కంటే ఎక్కువ చెవి,  వినికిడి సంరక్షణ అవసరాలు తీరడం లేదు. దీన్ని తగ్గించడమే ఈ వినికిడి సమస్య దినోత్సవ ముఖ్య ఉద్దేశ్యం.


ప్రజలు తాము నివసించే  ప్రాంతంలో చెవి,  వినికిడిని బలోపేతం చేయడంలో సభ్య దేశాలు సాధించిన పురోగతి అందరికీ ఆదర్శం కావాలి.  బంగ్లాదేశ్, మయన్మార్,  నేపాల్  మొదలైన దేశాలు ప్రపంచ ఆరోగ్య సంస్థ సహకారంతో  వినికిడి సమస్య ఉన్న ప్రాంతాలలో పరిస్థితులను అంచనా  వేశాయి.  చెవి,  వినికిడి సంరక్షణ సేవలను బలోపేతం చేయడానికి వ్యూహాత్మక అభివృద్ధి వైపు ముందుకు సాగుతున్నాయి. మయన్మార్ కమ్యూనిటీ స్థాయిలో కంటి సంరక్షణ, వృద్ధుల సంరక్షణ,  మానసిక ఆరోగ్య సేవలతో చెవి,  వినికిడి సంరక్షణను అనుసంధానించింది. భూటాన్ పిల్లలకు ఉచిత వినికిడి పరీక్షలు,  వినికిడి సహాయ సేవలను అమలు చేసింది. ఇండోనేషియా పాఠశాలల్లో ఇంటిగ్రేటెడ్ హియరింగ్,  విజన్ స్క్రీనింగ్‌ను ప్రారంభించింది. సహాయక ఉత్పత్తులపై శిక్షణ వినికిడి మాడ్యూళ్ల  క్షేత్ర-పరీక్ష భారతదేశంలో జరుగుతోంది.

ఈ ప్రపంచ వినికిడి దినోత్సవం నాడు ప్రభుత్వాలు, ఆరోగ్య నిపుణులు, పౌర సమాజం,  వ్యక్తులు చెవి,  వినికిడి సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, వినికిడి సమస్య వల్ల ఎదురయ్యే సవాళ్లను  సవాలు చేయాలని ప్రజలందరూ కృషి చేయాలి.  వినికిడి సమస్యను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు.  


చాలా వరకు వినికిడి సమస్యలు మొదట్లోనే గుర్తించి తగిన వైద్యం తీసుకోవడం వల్ల నయం అవుతాయి. కానీ వినికిడి సమస్య పెరిగిన తరువాత దాన్ని నయం చేయడం కష్టం.  వినికిడి పరికరాలు,  శస్త్ర చికిత్సలు మొదలైనవి మాత్రమే ఈ సమస్యకు పరిష్కారంగా నిలుస్తాయి. కానీ వినికిడి సమస్య ఉన్న వ్యక్తులను ఎక్కువకాలం అలాగే ఎలాంటి వైద్యం లేకుండా వదిలెయ్యడం వల్ల అది కాస్తా మానసిక సమస్యగా మారే అవకాశం ఉంది.  కాబట్టి ఈ సమస్య గురించి ఎవరూ నిర్లక్ష్యం చేయకూడదు.

                                                     *రూపశ్రీ.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News