చంద్రబాబు ఇంటి వద్ద హైటెన్షన్.. టీడీపీ, వైసీపీ కార్యకర్తల ఫైట్!!

 

ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం వద్ద డ్రోన్ చక్కర్లు కొట్టడంపై టీడీపీ నేతలు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేయగా.. వరద పరిస్థితిపై అంచనా కోసం తామే విజువల్స్ తీయాల్సిందిగా ఆదేశించామని ఏపీ జలవనరుల శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఇంటి వద్దకు టీడీపీ శ్రేణులు భారీగా చేరుకోగా, పోటీగా అక్కడకు వైసీపీ కార్యకర్తలు కూడా పెద్దఎత్తున తరలివచ్చారు.ఈ సందర్భంగా టీడీపీ వైసీపీ శ్రేణులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అది కాస్తా శ్రుతిమించడంతో ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి. ఈ గొడవ విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు డొక్కా మాణిక్యవరప్రసాద్, వర్ల రామయ్య, ఆలపాటి రాజా, మద్దాల గిరి తదితరులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. దీంతో చంద్రబాబు నివాసం వద్ద హైటెన్షన్ నెలకొంది.