చివరి బంతి వరకూ ఉత్కంఠ.. ఒక్క పరుగు తేడాతో విజయం.. హైదరాబాద్, రాజస్థాన్ మ్యాచ్ థ్రిల్లర్
posted on May 3, 2024 10:26AM
బంతి బంతికీ ఆధిక్యతలు మారిపోతూ, చివరి బంతి వరకూ విజయం అటా ఇటా అని దోబూచులాడుతుంటే.. ఒక మ్యాచ్ లో ఇంత కంటే మజా ఏముంటుంది? అలాంటి మ్యాచ్ ఐపీఎల్ లో భాగంగా గురువారం రాత్రి హైదరాబాద్- రాజస్థాన్ జట్ల మధ్య జరిగింది. హైదరాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ అటు ఆటగాళ్లనే కాదు స్టేడియంలో ఆ మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షిస్తున్న ప్రేక్షకులతో పాటు టీవీలు, ఫోన్లలో వీక్షిస్తున్న లక్షల మందికి బ్లడ్ ప్రషర్ పెంచేసింది. ఇది కదా మజా అంటే అనుకునేలా చేసింది. వీక్షకులందరినీ మునివేళ్లపై నిలబెట్టిన ఈ మ్యాచ్ లో చివరి బంతికి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు గెలిచింది. అది వేరే సంగతి. కానీ ఈ మ్యాచ్ లో నిజమైన విజేత మాత్రం క్రికెట్టే. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ఎందుకుంత పాపులర్ గేమ్ అయ్యిందో.. ఇప్పటి దాకా అర్ధం కాని వారెవరైనా ఉంటే, వారీ మ్యాచ్ చూసి ఉంటే అర్దమైపోయి ఉంటుంది. ఏళ్ల తరబడి గుర్తుండిపోయే మ్యాచ్ లా ఇది తప్పకుండా మిగిలిపోతుంది. విజయం కోసంఇరు జట్లు సర్వం ఒడ్డి పోరాడాయి. చివరి ఓవర్ చివరి బంతికి రెండు పరుగులు అవసరమైన దశలో ఆ ఆఖరు మెట్టుపై రాజస్థాన్ తడబడింది. మ్యాచ్ చేజార్చుకుంది. చివరి ఓవర్ చివరి బంతికి భువనేశ్వర్ రాజస్థాన్ బ్యాటర్ పావెల్ ను ఔట్ చేయడంతో హైదరాబాద్ జట్లు విజేతగా నిలిచింది. అయితే క్రికెట్ అభిమానుల మనస్సులను మాత్రం హైదరాబాద్ తో పాటు రాజస్థాన్ కూడా గెలుచుకుంది. ఇరు జట్లూ కలిసి క్రికెట్ ను గెలిపించాయి.
ఇక మ్యాచ్ వివరాలలోకి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 2012 పరుగులు చేసింది. హైదరాబాద్ బ్యాటర్లలో నితీశ్ 42 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్సర్లతో 76 పరుగులు సాధించాడు. ఓపెనర్ ట్రావిస్ హెడ్ ట్రావిస్ హెడ్ 44 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్లతో 58 పరుగులు చేశాడు. చివరిలో క్లాసిన్ మెరుపులు తోడవ్వడంతో హైదరాబాద్ 201 పరుగులు చేయగలిగింది. 202 పరుగుల విజయ లక్ష్యంతదో బ్యాటింగ్ ఆరంభించిన రాజస్థాన్ అనంతరం 202 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. అయితే ఆ జట్టుకు శుభారంభం దక్కలేదు. తొలి ఓవర్ లోనే సూపర్ ఫామ్లో ఉన్న బట్లర్ను, కెప్టెన్ సంజూ శాంసన్ భువనేశ్వర్ కుమార్ పెవిలియన్ కు పంపేశాడు. బట్లర్ రెండో బంతికి జాన్సెన్కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయితే, ఐదో బంతికి శాంసన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇద్దరూ డకౌట్ అయ్యారు. భువనేశ్వర్ వేసిన తొలి ఓవర్ లో ఒక్క పరుగు మాత్రమే సాధించిన రాజస్థాన్ రెండు వికెట్లు కోల్పోయింది.
అయితే ఈ దశలో మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్, రెండో డౌన్ లో వచ్చిన పరాగ్ లు జట్టును పోరాటంలో నిలిపారు. వీరిద్దరి దూకుడైన ఆటతో రాజస్థాన్ పది ఓవర్లకు 100 పరుగులు పూర్తి చేసింది. జట్లు స్కోరు 135 పరుగుల వద్ద ఉండగా జైస్వాల్ నటరాజన్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ గా వెనుదిరిగాడు. ఆ తరువాత రెండు ఓవర్లకే కమిన్స్ బౌలింగ్ లో పరాగ్ వెనుదిరిగాడు. దీంతో 16 ఓవర్లకు ఆ జట్టు 4 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. చివరి నాలుగు ఓవర్లలో ఆజట్టు విజయానికి 42 పరుగులు చేయాల్సిన స్థితిలో విజయం రాజస్థాన్ వైపే ఉందని పించింది. నటరాజన్ వేసిన 18వ ఓవర్లో హెట్మయర్ ఔటయ్యాడు జురెల్ ఔటై పెవిలియన్ కు చేరడం, 19వ ఓవర్ను కమిన్స్ పొదుపుగా వేసి కేవలం 7 పరుగులే ఇవ్వడంతో విజయం కోసం చివరి ఓవర్ లో 13 పరుగులు చేయాల్సి వచ్చింది.
ఆ చివరి ఓవర్ ను భువనేశ్వర్ వేశాడు. తొలి బంతికి అశ్విన్ సింగిల్ రెండో బంతికి పావెల్ రెండు మూడో బంతికి ఫోర్ తో తొలి మూడు బంతులకే ఏడు పరుగులు వచ్చాయి. ఆ తరువాతి రెండు బంతులకు నాలుగు పరుగులు వచ్చాయి. దీంతో చివరి బంతికి రెండు పరుగులు చేస్తే విజయం, ఒక పరుగు చేస్తే టై అన్నట్లుగా పరిస్థితి మారింది. ఇరు జట్లలోనూ ఉత్కంఠ తారస్థాయికి వెళ్లింది. అయితే చివరి బంతికి భువనేశ్వర్ పావెల్ ను లెగ్ బిఫోర్ గా ఔట్ చేయడంతో రాజస్థాన్ ఒక్క పరుగు తేడాతో పరాజయం పాలైంది.