టైమ్ టాప్‌ హండ్రెడ్‌లో ధోనీ

వాషింగ్టన్: 'మిస్టర్ కూల్'గా పేరొందిన భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేందర్‌సింగ్ ధోనీకి అరుదైన గౌరవం లభించింది. ప్రఖ్యాత ఆంగ్ల పత్రిక 'టైమ్ మ్యాగజైన్'  ఈ ఏడాదికి గానూ రూపొందించిన ప్రపంచంలోనే 100 మంది అత్యంత ప్రభావశీలుర జాబితాలో ఈ జార్ఖండ్ కుర్రాడు 52వ స్థానం సంపాదించుకున్నాడు. 28 ఏళ్ల తరువాత భారత క్రికెట్ జట్టు ప్రపంచ్ కప్‌ను కైవసం చేసుకోవడానికి కారకుడైన దోనీపై టైమ్స్ పత్రిక.. ఈ సందర్భంగా ప్రశంసల జల్లు కురిపించింది. "భారత క్రికెట్ జట్టుకు ఇంత వరకు నాయకత్వం వహించిన కెప్టెన్లు అందరిలోకీ.. అత్యుత్తమమైన కెప్టెన్‌గా దోనీ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. మైదానంలో ప్రశాంత చిత్తంతో ఉండటంలోనే కాకుండా వినమ్రతలోనూ అతడికి అతటే సాటి. అతడు కేవలం భారత్‌కు ప్రపంచ్ కప్‌ను సాధించడమే కాదు.. ఎలా గెలవాలో కూడా తన దేశానికి నేర్పాడు'' అని టైమ్స్ కొనియాడింది.

కాగా.. రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ, విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ, బ్రెయిన్ మ్యాపింగ్ నిపుణుడు వి.ఎస్.రామచంద్రన్, సామాజిక వేత్త అరుణా రాయ్‌లు కూడా ఈ జాబితాలో చోటు సంపాదించుకున్నారు. వ్యాపార కుశలతలో ముకేశ్ అంబానీ, వితరణలో అజీమ్ ప్రేమ్‌జీలకు మరెవరూ సాటిరారని టైమ్స్ పేర్కొంది. అవినీతిలో కూరుకుపోయిన భారత ప్రభుత్వ యంత్రాంగంలో మార్పుతేవడానికి సామాజిక వేత్త అరుణా రాయ్ చేస్తున్న కృషి అమోఘమైనదని ఈ పత్రిక శ్లాఘించింది. కాగా.. పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షుజా పాషాకు కూడా ఈ జాబితాలో స్థానం (17వ స్థానం) దక్కింది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మాత్రం ఈ జాబితాలో.. 86వ స్థానంలోకి పడిపోయారు. మరో వైపు.. ఆయన ప్రభుత్వంలోని విదేశాంగ మంత్రి హిలరీ క్లింటన్ మాత్రం 43వ స్థానంలో ఉండటం విశేషం. అరబ్బు ప్రపంచాన్ని కుదిపేసేలా.. ఈజిప్ట్‌లో ప్రజా విప్లవం రావడానికి ఆన్‌లైన్ ద్వారా దోహదపడ్డ 'గూగుల్' సంస్థ ఎగ్జిక్యూటివ్ వేల్ గోనిమ్‌కు ఈ జాబితాలో ప్రథమ స్థానం లభించింది. తన పరిశోధనలతో పాత్రికేయ రంగంలో సంచలనాలను సృష్టిస్తున్న వెబ్‌సైట్ వికీలీక్స్ వ్యవస్థాపకుడు జులియన్ అసాంజ్‌కు ఈ జాబితాలో 9వ స్థానం లభించింది. సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో విప్లవానికి తెరదీసిన 'ఫేస్‌బుక్' వ్యవస్థాపకుడు మార్క్ జుకెర్‌బెర్గ్ 6వ స్థానంలో నిలిచారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu